కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని కాజేస్తున్న భారీ కుంభకోణాన్ని అధికారులు వెలికితీశారు. సుమారు రూ. 1,40,18,308/- మేర నిధుల దుర్వినియోగం జరిగినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విచారణలో తేలింది. గతంలో పే-సెక్షన్లో పనిచేసిన ఒక పోలీసు ఉద్యోగి, మరణించిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఎంప్లాయీ ఐడీలను దుర్వినియోగం చేసి IFMIS పోర్టల్లో ఇతరుల పేర్లను చేర్చాడు. ప్రైవేట్ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి, తన వ్యక్తిగత మొబైల్ నంబర్లను అనుసంధానించడం ద్వారా 2022 నుండి 2026 వరకు ప్రభుత్వ జీతాల సొమ్మును అక్రమంగా పొందినట్లు వెల్లడైంది.
అక్రమంగా పొందిన నిధులతో వ్యక్తిగత రుణాలు తీసుకోవడంతో పాటు నగదును వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై గౌష్ ఆలం ఆదేశాల మేరకు బాధ్యుడైన పోలీసు ఉద్యోగిపై కరీంనగర్ I-టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అలాగే, రాంచందర్ రావు మాట్లాడుతూ, ఈ కుంభకోణంలో మరెవరికైనా సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై అంతర్గత విచారణ కొనసాగుతోందని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
