సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ అధికారులు సంచలన విషయాలను వెల్లడించారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసుగా హైకోర్టుకు, లోయర్ కోర్టుకు ఇప్పటివరకు చెబుతూ వచ్చిన సిట్, తాజాగా ఏ4 సురేష్ రిమాండ్ రిపోర్టులో కీలక నిజాలను నివేదించింది. పోలీసులు విపరీతంగా కొట్టడం వల్లే సాయికృష్ణ మృతి చెందాడని సిట్ స్పష్టం చేసింది.
విజయవాడ కృష్ణలంక పోలీస్స్టేషన్లో సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని సాయికృష్ణను దారుణంగా కొట్టారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. పోలీసుల దెబ్బల కారణంగా గాయాలపాలైన సాయికృష్ణ పోలీస్స్టేషన్లోనే చనిపోలేదని, స్టేషన్లో ఉంచితే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో సీఐ నాగరాజు ఆదేశాల మేరకు క్షతగాత్రుడైన సాయికృష్ణను రాణిగారి తోటలోని ఒక ప్రైవేట్ పాడుబడ్డ భవనానికి తరలించినట్లు సిట్ తెలిపింది.
మే 12, 2026వ తేదీన సీఐ నాగరాజును కలవడానికి వెళ్లిన సురేష్.. రాణిగారి తోటలోని ఖాళీ భవనంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న సాయికృష్ణను ప్రత్యక్షంగా చూసినట్లు వెల్లడైంది. ఆ తర్వాత సాయికృష్ణ మృతదేహాన్ని సురేష్, సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్ కలిసి ఆయా తేదీల్లో దహనం చేశారని, ఎవరికీ ఎలాంటి ప్రాథమిక, సాంకేతిక ఆధారాలు దొరక్కుండా మృతదేహాన్ని పూర్తిగా మాయం చేసి ధ్వంసం చేశారని సిట్ కోర్టుకు వివరించింది.
సీసీ కెమెరాలు, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ లభించకుండా నిందితులందరూ కలిసి ముందుగానే చాలా జాగ్రత్తపడ్డారని సిట్ పేర్కొంది. ఈ కేసులో అరెస్టయిన ఏడుగురు నిందితులను కూలంకషంగా విచారించిన అనంతరం సాయికృష్ణ పోలీసుల దెబ్బల వల్లే హత్య చేయబడ్డాడని సిట్ నిర్ధారణకు వచ్చింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న సురేష్ను పోలీసులు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతనికి ఈనెల 24 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.

