Sai Krishna Missing Case: విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.. ఈ కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఉదయం నుంచి విస్తృతంగా విచారణ కొనసాగిస్తోంది. కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తూ కీలక ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దర్యాప్తులో భాగంగా నందిగామ ఏసీపీ చలసాని శ్రీనివాసరావును విచారణ అధికారి ఏసీపీ దైవప్రసాద్ పిలిపించి వివరాలు సేకరించారు. నందిగామలో జరిగిన నవీన్రెడ్డి హత్య కేసు, సాయికృష్ణ అదృశ్యం మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగుతోంది.
మే 23, 24 తేదీలపై ప్రత్యేక దృష్టి
సాయికృష్ణ కేసు ప్రస్తుతం మే 23, 24 తేదీల చుట్టూనే తిరుగుతోంది. మే 23 రాత్రి విజయవాడ బస్టాండ్ డిపార్చర్ బ్లాక్ వద్ద గుర్తుతెలియని మృతదేహం లభించిన ఘటనను పోలీసులు కీలకంగా పరిగణిస్తున్నారు. అదే మృతదేహాన్ని రాత్రి 8 గంటల సమయంలో స్వర్గపురి స్మశానవాటికకు తరలించిన అంశంపై కూడా లోతుగా విచారణ చేస్తున్నారు. అయితే, గుర్తుతెలియని మృతదేహం గురించి కృష్ణలంక పోలీసులు మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపో అధికారికి పంపిన అధికారిక లేఖ, దానిపై హెడ్ కానిస్టేబుల్ చెన్నారావు ఇచ్చిన ధృవీకరణ పత్రాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ పత్రాల్లోని వివరాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
మరికొంతమందికి నోటీసులు
ఇక, ఈ కేసులో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణతో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపో ఇన్చార్జిని కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం. కేసులోని అన్ని కోణాలను పరిశీలిస్తూ సాయికృష్ణ ఆచూకీపై స్పష్టతకు రావాలని దర్యాప్తు బృందం ప్రయత్నిస్తోంది. కాగా, ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.. తనను కలిసిన సాయి కృష్ణ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు.. ఆ తర్వాత ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు మరింత వేగం పుంజుకున్న విషయం విదితమే..

