Sai Krishna: సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు బట్టబయలు..

Sai Krishna Missing Case

Sai Krishna Missing Case

Sai Krishna: విజయవాడలో తీవ్ర కలకలం రేపుతున్న సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తులో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసుల అక్రమ ప్రమేయంపై దర్యాప్తు బృందం పక్కా ఆధారాలను సేకరించింది. ముఖ్యంగా సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న మార్కాపురం టూ విజయవాడ ఎపిసోడ్ ఇప్పుడు ఈ విచారణలో అత్యంత కీలకంగా మారింది. ప్రకాశం జిల్లా మార్కాపురానికి విజయవాడ టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ నవీన్‌తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు రహస్యంగా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ సాయికృష్ణను అదుపులోకి తీసుకుని, ఎలాంటి అధికారిక రికార్డులు లేకుండా ఒక ప్రైవేట్ వాహనంలో విజయవాడకు తరలించినట్లు ఆధారాలతో సహా నిర్ధారించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం మూడో రోజు విచారణను మరింత తీవ్రతరం చేసింది. ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ (ADCP) లతాకుమారి, ఎస్ఐ నవీన్‌లతో పాటు పలువురు కానిస్టేబుళ్లను పిలిపించి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. అయితే, అసలు ఎవరి ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అంత దూరం మార్కాపురానికి వెళ్లారు? దీని వెనుక ఉన్న ఉన్నతాధికారి ఎవరు? అనే కోణంలో దర్యాప్తు అధికారులు నిశితంగా ఆరా తీస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే 24 గంటలకు పైగా సుదీర్ఘంగా విచారణ సాగగా, లభించిన క్లూస్ టీమ్ నివేదికలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా మూడో రోజు విచారణను మరింత లోతుగా సాగిస్తున్నారు.

×
×
Ad

మరోవైపు నందిగామ ఏసీపీ చలసాని శ్రీనివాస్‌ను నిన్ననే దాదాపు 8 గంటల పాటు విచారించిన దర్యాప్తు బృందం, ఈ రోజు ఆయనను మరోసారి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నిస్తోంది. సాయికృష్ణపై గతంలో నమోదైన కేసులు, ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలోని అధికారుల పాత్రపై దైవప్రసాద్ బృందం ముమ్మరంగా విచారణ జరుపుతోంది. ఈ కేసు విచారణలో రోజుకో పక్కా ఆధారం దొరుకుతుండటంతో, దీనితో సంబంధం ఉన్న పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దర్యాప్తు ఎటు తిరిగి ఎవరి మెడకు చుట్టుకుంటుందో, ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోనని కమిషనరేట్ పరిధిలోని పలువురు అధికారులు తీవ్ర టెన్షన్‌లో మునిగిపోయారు.