Sai Krishna Custodial Death Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెబియస్ కార్పస్ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో విచారణలో కొత్త మలుపు తిరిగింది. ఇదే పిటిషన్లో సీబీఐ విచారణ కోరిన పిటిషన్ను కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో సీబీఐ విచారణ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు ఒక న్యాయవాది సంతకం చేయించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే హెబియస్ కార్పస్ పిటిషన్ను కూడా ఉపసంహరించుకుంటున్న విషయంపై పిటిషనర్కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సాయికృష్ణ పిన్ని కనకదుర్గ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
పిటిషనర్కు తెలియకుండా హెబియస్ కార్పస్ పిటిషన్ను ఎలా వెనక్కి తీసుకుంటారని కనకదుర్గ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. పిటిషనర్ అనుమతి లేకుండానే సంతకం తీసుకున్నారని కోర్టు ముందు వాదించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్కు తెలియకుండా హెబియస్ కార్పస్ పిటిషన్ ఉపసంహరణకు సంబంధించిన పిటిషన్ ఎలా దాఖలు చేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు. సంబంధిత పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఈ అంశాన్ని బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి సంబంధిత న్యాయవాది లైసెన్స్ రద్దుకు కూడా సిఫారసు చేసే అవకాశం ఉందని న్యాయమూర్తి హెచ్చరించారు. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

