CM Revanth Reddy: తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్ను ఎంచుకున్న సఫ్రాన్కు సీఎం రేవంత్రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్లో సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) కొత్త సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ కొత్త సదుపాయం ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఇది భారతదేశంలో LEAP ఇంజిన్ ల మొట్టమొదటి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (MRO) సెంటర్ అని చెప్పారు. రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సదుపాయంతో 1,000 మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇది మన స్థానిక ఎంఎస్ఎంఈలకు, ఇంజనీరింగ్ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలను కల్పిస్తుందని వెల్లడించారు. ఇవాళ సఫ్రాన్కు చెందిన M88 మిలిటరీ ఇంజిన్ MROకి కూడా శంకుస్థాపన చేసుకున్నామన్నారు. ఈ MRO భారత వైమానిక దళం, భారత నావికాదళానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
READ MORE: Ram Gopal Varma : వాళ్ల కలెక్షన్ల కోసం నేను పైరసీ చూస్తా! – ఆర్జీవీ షాకింగ్ స్టేట్మెంట్ వైరల్
హైదరాబాద్ భారతదేశంలోని ప్రధాన ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్.. తెలంగాణలో 25 కంటే ఎక్కువ ప్రధాన ప్రపంచ కంపెనీలు, 1,500 కి పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. “మా ప్రగతిశీల పారిశ్రామిక విధానం, మా ఎమ్.ఎస్.ఎమ్.ఈ విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచింది. మా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్ పార్కులు, SEZలు ప్రముఖ ప్రపంచ కంపెనీల నుండి అనేక భారీ పెట్టుబడులను ఆకర్షించాయి. సఫ్రాన్, బోయింగ్, ఎయిర్ బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు హైదరాబాద్ ను తయారీ, పరిశోధన, అభివృద్ధి కోసం ఎంచుకున్నాయి. హైదరాబాద్ భారతదేశంలోని ప్రముఖ MRO, ఏరో ఇంజిన్ హబ్ లలో ఒకటి. ఏరోస్పేస్, రక్షణ రంగంలో మన ఎగుమతులు గత ఏడాది రెట్టింపు అయ్యాయి. 9 నెలల్లో రూ.30,742 కోట్లకు చేరుకున్నాయి.. మొదటిసారిగా మన ఫార్మా ఎగుమతులను అధిగమించాయి.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి తెలంగాణ ఏరోస్పేస్ అవార్డును పొందింది.. ఏరోస్పేస్ పెట్టుబడులను ఆకర్షించడానికి నైపుణ్యం చాలా ముఖ్యమైన ప్రమాణం.. టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో తెలంగాణ 100 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లను (ఐటీఐఎస్) అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసింది… మా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ విమానాల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణపై దృష్టి పెడుతుంది. 30 వేల ఎకరాల విస్తీర్ణంలో మేం భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం.. మా విజన్ ను ఆవిష్కరించడానికి డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ 2047 – గ్లోబల్ సమ్మిట్ కు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని మేం ప్రయత్నిస్తున్నాం. బెంగళూరు-హైదరాబాద్ ను డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కారిడార్ గా ప్రకటించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా..” అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.