NTV Telugu Site icon

Ukraine-Russia: క్షిపణులతో రష్యా ఎటాక్.. ఏడుగురు ఉక్రెయిన్‌ పౌరులు మృతి

Ukrine

Ukrine

రష్యా తాజాగా ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉక్రెయిన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బఫర్‌జోన్‌ ఏర్పాటే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఉధృతం చేసింది. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌ లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడింది. గురువారం ఉదయం భారీ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో తమ దేశానికి చెందిన ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, 16 మందికి తీవ్ర గాయాలైనట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. రష్యాది అతి కిరాతకమైన చర్యగా అభివర్ణించారు.. గత రెండు సంవత్సరాలుగా అలుపెరుగని యుద్ధం చేస్తున్నట్లు గుర్తు చేసిన ఆయన.. పాశ్చాత్య భాగస్వామ్య దేశాల నుంచి తగిన సహకారం లభించడం లేదని నిరాశ వ్యక్తంచేశారు. రష్యా వైమానిక దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తగినన్ని రక్షణ వ్యవస్థలను సమకూర్చడంపై భాగస్వామ్య దేశాలు దృష్టి సారించడం లేదన్నారు.

ఇది కూడా చదవండి: Heatwave: దేశంలోని పలు ప్రాంతాల్లో 48.8 డిగ్రీల ఎండలు.. ‘రెడ్’ వార్నింగ్ జారీ

రష్యా సరిహద్దు నుంచి ఖర్కీవ్‌ నగరం కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాలను స్వాధీనం చేసుకొని బఫర్‌ జోన్‌ ఏర్పాటు చేయాలనేది రష్యా లక్ష్యం. ఈ క్రమంలోనే క్షిపణులతో దాడి చేసి అక్కడి ఆస్తులను ధ్వంసం చేస్తోంది. వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన వైమానిక రక్షణ వ్యవస్థను సమకూర్చుకోవడంలో ఉక్రెయిన్‌ వెనకబడింది. పాశ్చాత్య దేశాల మద్దతు కోసం ఎదురుచూస్తోంది. ఇదే అదునుగా భావించిన రష్యా దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌ పవర్‌ గ్రిడ్‌తోపాటు, జనసంచార ప్రదేశాల్లో క్షిపణులతో విరుచుకుపడుతోంది.

ఇది కూడా చదవండి: ADR Report: లోక్‌సభ అభ్యర్థులపై సంచలన రిపోర్ట్! ఎంతమంది నిరక్షరాస్యులున్నారంటే..!

గత రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను రష్యా ధ్వంసం చేసింది. ఇంకా దాడులను కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ ఈ దాడులను ఎదుర్కొలేకపోతుంది. తమ మిత్రదేశాల సాయం కోసం ఎదురుచేస్తోంది.