NTV Telugu Site icon

Andhra Pradesh: సాగునీటి పనులకు నిధులు.. రూ.8.97 కోట్లు ఆమోదం

Pawan Kalyan

Pawan Kalyan

2023లో వచ్చిన మిచాంగ్ తుపాను ప్రభావానికి కాకినాడ జిల్లాలో పలు సాగునీటి కాలువలు, కట్టలు, గేట్లు, పూడికతీత వంటి సమస్యలు ఏర్పడ్డాయి. తుపాను తగ్గిన వెంటనే ఈ నష్టానికి సంబంధించి జిల్లా అధికారులు 288 ఇరిగేషన్ పనులు వెంటనే చేయాలని ప్రతిపాదనలు అప్పటి ప్రభుత్వానికి పంపారు. నాటి ప్రభుత్వం ఆ పనులను కనీసం పట్టించుకోకుండా పక్కన పెట్టేసింది. తాజాగా ఏలేరు రిజర్వాయర్‌కు వరద వచ్చినపుడు బాధిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన జరిపినప్పుడు సాగు నీటి పనులకు సంబంధించిన గతంలో పంపిన ప్రతిపాదనలను అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు గుర్తు చేశారు. సత్వరమే చేయాల్సిన 39 పనులకు 8.97 కోట్ల నిధుల పరిపాలన అనుమతులు లభించాయి.

Read Also: AP Govt: పర్యాటకులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం

జలవనరుల శాఖ ద్వారా టెండరు నోటీసు వెంటనే ఇచ్చేలా చూడాలని.. 2 నెలల్లోగా పనులు పూర్తయ్యేలా చూడాలని జిల్లా అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో.. కాకినాడ రూరల్, ముమ్మిడివరం, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, రామచంద్రపురం నియోజకవర్గాల్లో గుర్తించిన సాగు నీటి పనులు వెంటనే జరగనున్నాయి. ఏలేరు వరదల్లో నష్టం జరిగిన సాగునీటి పనులను సైతం వెంటనే పూర్తి చేయాలని జిల్లా అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వచ్చిన ఏలేరు వరదలకు కొన్ని చోట్ల కాలువల గట్లు బలహీనం అయ్యాయి.. పూడికతీతలు చేయాల్సి ఉంది. మొత్తం 87 పనులను దీనిలో గుర్తించి, రూ. 5.97 కోట్ల మేర నిధులను కొన్ని జిల్లా కలెక్టర్ నిధుల నుంచి.. మరికొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచి సర్దుబాటు చేసి వెంటనే పనులకు టెండర్లు పిలవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.

Read Also: Vizianagaram: గుర్ల‌లో అదుపులోకొచ్చిన డ‌యేరియా.. తాగునీటి కాలుష్యం వల్లే వ్యాధి