ఎన్నికల ముందు ఆయా ప్రభుత్వాలు ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయడం సహజంగా జరుగుతుంటాయి. పైగా నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రకటనలు కూడా ఎదురుచూస్తుంటారు. ఇలాంటి సమయంలో నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు కేడీగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు.
త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో నిరుద్యోగుల్ని మోసగించే ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
రైల్వే శాఖ (RRB)లో 4,660 ఉద్యోగాలంటూ చక్కర్లు కొడుతున్న ఓ ఉద్యోగ ప్రకటనపై కేంద్రం స్పందించింది. ఆ ఉద్యోగ ప్రకటన నకిలీదని తేల్చిచెప్పింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రైల్వేశాఖ ఏప్రిల్ 15 నుంచి మే 14వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుందని పేర్కొంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది.
ఈ మధ్య కాలంలో ఎలాంటి ఉద్యోగ ప్రకటనను రైల్వే మంత్రిత్వశాఖ విడుదల చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్పీఎఫ్లో 452 ఎస్సై, 4,208 కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య, వేతనం, వయో పరిమితి, విద్యార్హతలు, ఉద్యోగ నియామక ప్రక్రియ, దరఖాస్తు రుసుం తదితర అంశాలతో కూడిన ఈ నకిలీ ప్రకటనను ఎవరూ నమ్మొద్దని నిరుద్యోగులకు కేంద్రం విజ్ఞప్తి చేసింది.
FAKE JOBS