RR vs SRH: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మరో మూడు మ్యాచ్ లతో ఈ మెగా టోర్నీ ముగియనుండగా.. నేడు న్యూ చండీగఢ్ వేదికగా జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే మ్యాచ్కు ముందు అభిమానులను వెంటాడుతున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే. అదే.. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఏ జట్టు క్వాలిఫయర్-2కు చేరుకుంటుందని?
ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఫైనల్ మ్యాచ్కు మాత్రమే రిజర్వ్ డే ఉంటుంది. ఎలిమినేటర్, క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2 మ్యాచ్ లకు రిజర్వ్ డే లేదు. దీంతో వర్షం లేదా ఇతర కారణాలతో మ్యాచ్ పూర్తిగా రద్దయితే.. లీగ్ స్టేజిలో పాయింట్ల పట్టిక ఆధారంగా మెరుగైన స్థానంలో ఉన్న జట్టుకే తదుపరి దశకు అర్హత లభిస్తుంది. ఈ లెక్కన చూస్తే.. ఒకవేళ ఎలిమినేటర్ మ్యాచ్ రద్దయితే సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫయర్-2కు చేరుకుంటుంది. ఎందుకంటే, లీగ్ దశలో హైదరాబాద్ జట్టు 14 మ్యాచ్ల్లో 9 విజయాలతో 18 పాయింట్లు సాధించి టాప్-3లో నిలిచింది. రన్రేట్ కారణంగా మూడో స్థానానికి పరిమితమైనా.. నాలుగో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ కంటే మెరుగైన స్థితిలో ఉంది. రాజస్థాన్ మాత్రం 14 మ్యాచ్ల్లో 8 విజయాలతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది.
అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే ఎలిమినేటర్ మ్యాచ్ కు పెద్దగా వర్ష ముప్పు కనిపించడం లేదు. దీంతో అభిమానులు పూర్తి మ్యాచ్ను ఆస్వాదించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్ విషయంలో మాత్రం ఐపీఎల్ ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయి. మే 31న జరగాల్సిన ఫైనల్ కు రిజర్వ్ డే కేటాయించారు. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా జరగకపోయినా లేదా కనీసం ఐదు ఓవర్ల ఆట కూడా సాధ్యంకాకపోయినా.. మరుసటి రోజు అయిన జూన్ 1న మ్యాచ్ నిర్వహిస్తారు. రిజర్వ్ డే రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే.. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును ఐపీఎల్ 2026 ఛాంపియన్గా ప్రకటిస్తారు.
