RR vs LSG : IPL 2026లో ప్లేఆఫ్ రేసు రోజురోజుకీ ఉత్కంఠభరితంగా మారుతోంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స జట్లు ప్లేఆఫ్స్లో తమ స్థానాలను ఖాయం చేసుకోగా.. మిగిలిన ఒక్క బెర్త్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. యశస్వి జైస్వాల్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ మొదట బ్యాటింగ్కు దిగనుంది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే రాజస్థాన్కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం.
టాస్ సందర్భంగా మాట్లాడిన యశస్వి జైస్వాల్.. జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడని, త్వరలోనే కోలుకుంటాడని తెలిపాడు. అలాగే ఈ మ్యాచ్ కోసం జట్టులో మూడు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. సందీప్ శర్మ, సుశాంత్ మిశ్రా, లువాన్-డ్రే ప్రిటోరియస్లను తుది జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్కు ఈ మ్యాచ్కు ముందు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. స్టార్ ఆటగాడు ఐడెన్ మార్క్రమ్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లగా.. మహమ్మద్ షమీ జట్టుకు దూరమయ్యాడు. వారి స్థానాల్లో ఆయుష్ బడోని, మొహ్సిన్ ఖాన్లకు అవకాశం లభించింది.
టాస్ అనంతరం మాట్లాడిన రిషబ్ పంత్.. జైపూర్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉందని, ముందుగా బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా పెద్దగా తేడా ఉండదని వ్యాఖ్యానించాడు. అయితే మ్యాచ్లో మంచి ఆరంభం కీలకమని తెలిపాడు. ఇక ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లలో రాజస్థాన్ రాయల్స్ 5-2 తేడాతో ఆధిక్యంలో ఉంది. అయితే జైపూర్లో జరిగిన మూడు మ్యాచ్ల్లో రెండింటిలో లక్నో విజయం సాధించడం గమనార్హం.
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI:
యశస్వి జైస్వాల్ (కెప్టెన్), లువాన్-డ్రే ప్రిటోరియస్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే, దాసున్ శనక, జోఫ్రా ఆర్చర్, సుశాంత్ మిశ్రా, సందీప్ శర్మ, బ్రిజేశ్ శర్మ, యష్రాజ్ పుంజ్
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI:
మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఆకాష్ మహరాజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్
