Rohit Sharma: రోహిత్‌, యశస్వి, శ్రేయస్‌ లేకుండానే బరిలోకి జట్టు!

  • ఫిబ్రవరి 6న ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌
  • రోహిత్‌ శర్మ లేకుండానే బరిలోకి ముంబై
  • యశస్వి జైస్వాల్, శ్రేయస్‌ అయ్యర్ కూడా
Rohit Sharma Ranji Trophy 2025

Rohit Sharma Ranji Trophy 2025

రంజీ ట్రోఫీలో ముంబై జట్టు రోహిత్‌ శర్మ లేకుండానే బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 6న ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌ కోసం రోహిత్ భారత జట్టుతో చేరాడు. దీంతో గురువారం మేఘాలయాతో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ గ్రూపు-ఎ మ్యాచ్‌లో ముంబై హిట్‌మ్యాన్ లేకుండానే ఆడనుంది. మరోవైపు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన యశస్వి జైస్వాల్, శ్రేయస్‌ అయ్యర్ కూడా ముంబై తరఫున బరిలో దిగడం లేదు. వీరి స్థానాల్లో ఆంగ్‌క్రిష్‌ రఘువంశి, సూర్యాంష్‌ షెడ్గే, అథర్వ అంకోలేకర్‌లను తీసుకున్నట్లు మంగళవారం ముంబై ప్రకటించింది.

ఇటీవల భారత టెస్టు జట్టు ఘోర పరాభవాలు చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3-0తో వైట్‌వాష్‌, ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ రెండు సిరీస్‌లలో కెప్టెన్‌, బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ విఫలమయ్యాడు. దాంతో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాలంటూ రోహిత్‌కు మాజీ ‍క్రికెటర్లు సూచనలు చేశారు. ఈ విమర్శలపై స్పందించని హిట్‌మ్యాన్.. బీసీసీఐ ఆదేశాల మేరకు రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. సొంత జట్టు ముంబై తరఫున రంజీ రెండో దశ పోటీల్లో జమ్మూ కశ్మీర్‌పై ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేసి నిరాశపర్చాడు. మరి వన్డే సిరీస్‌లో అయినా రాణిస్తాడేమో చూడాలి.