CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

Cm Revanth Reddy

Cm Revanth Reddy

Revanth Reddy: హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ వారసత్వ సంపద పరిరక్షణ, మూసీ నది పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సిఎం సలహాదారు రామకృష్ణారావు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అగా ఖాన్ ఫౌండేషన్‌పై తమకు అత్యంత గౌరవం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్బంగా తెలిపారు. తెలంగాణ వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగా ఖాన్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఫౌండేషన్ సహకారంతో ఇటీవలే శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించుకున్నామని, కుతుబ్ షాహీ టూంబ్స్‌ను కూడా అగా ఖాన్ ఫౌండేషన్ పునరుద్ధరించిందని పేర్కొన్నారు.

మూసీ నది పునరుజ్జీవం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సీఎం తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలోని సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో అగా ఖాన్ ఫౌండేషన్ సహకారం కోరుతున్నట్లు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. మూసీ నదిని నైట్ ఎకానమీకి అనుగుణంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

అలాగే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు తప్పక హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సమ్మిట్‌కు 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చెప్పారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, దీనిని నెట్-జీరో సిటీగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ఎయిర్‌పోర్టుకు కేవలం 20 నిమిషాల దూరంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు.

ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్‌కు చెందిన సంస్థ రూపొందిస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందులో 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని సీఎం పేర్కొన్నారు.