ప్రయాణికుల ఇబ్బందులకు కారణమైన సిబ్బందికి వేటు పడింది. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (Air India Express)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ ఎక్కువవుతోంది. సిబ్బంది ఉన్నపలంగా సెలవులు పెడుతున్నారు. దీంతో సుమారు 100 విమానాలను ఎయిరిండియా సంస్థ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో సెలవులు పెట్టి విమాన సేవలకు అంతరాయం కల్పించిన వారిపై సంస్థ తాజాగా చర్యలకు ఉపక్రమించింది. సుమారు 30 మంది సిబ్బందిని సంస్థ తొలగించింది. ఈ మేరకు బుధవారం రాత్రి 30 మంది సిబ్బందికి సంస్థ తొలగింపునకు సంబంధించి నోటీసులు పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నోటీసులలో పలు అంశాలు పేర్కొంది. అవేంటంటే..
READ MORE: Barron Trump: డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడి పొలిటికల్ ఎంట్రీ
విధులకు హాజరు కాని కారణంగా విమానాలు రద్దవ్వడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. విధుల నియమ నిబంధనల ఉల్లంఘన కారణంగా తక్షణమే వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ నోటీసుల్లో పేర్కొంది. సరైన కారణం లేకపోయినా కావాలనే సెలవు పెట్టారని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారని ఉద్యోగులకు పంపిన నోటీసుల్లో తెలిపింది. దీంతో సంస్థ యాజమాన్య విధానాలను నిరసిస్తూ అనారోగ్య కారణాలతో 200 మందికిపైగా క్యాబిన్ సిబ్బంది ఒకేసారి సెలవు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఏకంగా 100కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చింది. వేల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. షెడ్యూల్ ప్రకారం విధులకు హాజరు కావాల్సిన సిబ్బంది చివరి నిమిషంలో సిక్ లీవ్ పెట్టడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని తెలిపారు. ఈ ప్రభావం సుమారు 15 వేల మంది ప్రయాణికులపై పడినట్లు సదరు వర్గాలు తెలిపాయి. మరోవైపు విమానాల రద్దుపై నివేదిక సమర్పించాలని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ యాజమాన్యాన్ని పౌరవిమానయాన శాఖ కోరింది. ఉద్యోగులు ముందస్తు పథకం ప్రకారమే చేశారా.. అనే అంశంపై చర్చ కొనసాగుతోంది. నోటీసులు తీసుకున్న ఉద్యోగుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.