నటి, సామాజిక కార్యకర్త రేణూ దేశాయ్ (Renu Desai) సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నాళ్లుగా తన వ్యక్తిగత జీవితంపై, రాజకీయ అభిప్రాయాలపై వస్తున్న అసభ్యకరమైన కామెంట్స్ పట్ల ఆమె విరుచుకుపడ్డారు. ముఖం చూపించే ధైర్యం లేక ఫేక్ అకౌంట్లతో దూషిస్తున్న వారిని వెతికి పట్టుకుని మరీ బుద్ధి చెబుతానని ఆమె ఇన్ స్టా వేదికగా హెచ్చరించారు.
Also Read : Vijay-Rashm : పెళ్లి చేసుకున్న ఆనందంలో ‘విరోష్’ అదిరిపోయే నిర్ణయం..
జనవరిలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో వీధి కుక్కల సంరక్షణ గురించి తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా చిత్రీకరించారని ఆమె మండిపడ్డారు. ఒక చిన్నారి మరణించిన ఘటనకు తన పాత వీడియోను ఎడిట్ చేసి అటాచ్ చేయడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను విడాకులు తీసుకున్నప్పటి నుండి నా భరణం గురించి, నా వ్యక్తిగత విషయాల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నేను వీధి కుక్కల సంరక్షణ కోసం ఎన్జీవో నడుపుతున్నాను.. మనుషుల కోసం కాదు. నన్ను తిట్టడానికి మీకు ఏ హక్కు లేదు’ అని ఆమె స్పష్టం చేశారు. దూషించే వ్యక్తులకు వార్నింగ్ ఇస్తూ.. ‘మీరు చేసే పనులు మీ ఇంట్లో అమ్మానాన్నలకు, అక్కాచెల్లెళ్లకు చూపించగలరా? ఇకపై ఇలాంటి పనులు చేసే వారిని గుర్తించి, వారి ఇంటికి వెళ్లి మరీ వాళ్ల తల్లిదండ్రుల ముందు మీ దుర్మార్గాలను ఎండగడతాను’ అని రేణూ దేశాయ్ హెచ్చరించారు. సోషల్ మీడియాను కేవలం ఇతరులను కించపరచడానికి వాడటం ఎంత వరకు సంస్కారమని ఆమె ప్రశ్నించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆమె డెసిషన్కు పలువురు మద్దతు తెలుపుతున్నారు.
