Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..

Bombay

Bombay

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)కి చెందిన ఎఫ్‌ఎంసీజీ సంస్థ అయిన ‘రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్’ (RCPL) ఐస్‌క్రీమ్ రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ‘బాంబే క్రీమరీ’ పేరిట సరికొత్త బ్రాండ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. స్వచ్ఛమైన డెయిరీ పదార్థాలతో తయారు చేసిన ఈ ఐస్‌క్రీమ్‌ను భారతదేశంలోనే అత్యంత అందుబాటు ధరలో లభించే ప్రీమియం బ్రాండ్‌గా మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది.

తమ వద్ద ఉన్న విస్తృతమైన పంపిణీ వ్యవస్థ, రిటైల్ నెట్‌వర్క్, వినియోగదారుల అవసరాలపై ఉన్న అవగాహనతో ఐస్‌క్రీమ్ విభాగంలో దీర్ఘకాలికంగా నిలదొక్కుకునేలా ఈ బ్రాండ్‌ను రూపకల్పన చేశారు. “అందుబాటు ధరలో ప్రపంచ స్థాయి నాణ్యత” అనే తమ ప్రధాన సూత్రానికి కట్టుబడి, నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

బాంబే క్రీమరీ ఆలోచన గురించి ఆర్సీపీఎల్ డైరెక్టర్ టి. కృష్ణకుమార్ మాట్లాడుతూ.. “పాల ఉత్పత్తుల తయారీలో ఎలాంటి షార్ట్‌కట్‌లు ఉపయోగించకూడదనే ఏకైక సూత్రంతోనే ఈ బ్రాండ్‌ను డిజైన్ చేశాం. మేము కేవలం ఐస్‌క్రీమ్ రంగంలోకి అడుగుపెట్టడమే కాకుండా, ఈ విభాగంలో బలమైన స్థానాన్ని సంపాదించేందుకు కట్టుబడి ఉన్నాం. నిజమైన పాల మీగడతో తయారయ్యే బాంబే క్రీమరీ ఐస్‌క్రీమ్‌లు ప్రతీ భారతీయ కుటుంబానికి అందుబాటు ధరలో లభిస్తాయి” అని స్పష్టం చేశారు.

ఈ బ్రాండ్ కింద కోన్లు, కప్పులు, టబ్‌లు, బార్లు, స్టిక్స్ వంటి వివిధ రకాల రూపాల్లో ఐస్‌క్రీమ్‌లను అందుబాటులోకి తేనున్నారు. వీటి ప్రారంభ ధరను రూ. 10గా నిర్ణయించారు. ప్రారంభంలో పశ్చిమ భారతంలో ఈ ఉత్పత్తులను విక్రయించి, అనంతరం దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నారు. 2023 నుంచే ఐస్‌క్రీమ్ పరిశీలిస్తున్న కంపెనీ, గతంలో కాంపా కోలా వంటి బ్రాండ్లతో పానీయాల రంగంలో సాధించిన విజయం తరహాలోనే ఎఫ్‌ఎంసీజీ నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తోంది.

అదే సమయంలో.. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని వంతారా చొరవతో అనంత్ అంబానీ నేతృత్వంలో ‘వంతారా క్రీమరీ’ పేరిట మే 2026లో ముంబైలో ఒక విలాసవంతమైన ఐస్‌క్రీమ్ బ్రాండ్ కూడా ప్రారంభమైంది. అయితే అది కేవలం ఒక ప్రీమియం విలాసవంతమైన లైనప్‌గా మాత్రమే కొనసాగుతుందని, ప్రస్తుతం లాంచ్ చేసిన బాంబే క్రీమరీ బ్రాండ్‌ ఆర్సీపీఎల్ ఎఫ్‌ఎంసీజీ విభాగంలోకి వస్తుందని స్పష్టం చేశారు.