Reliance Jio Laptop: రిలయన్స్ జియో నుంచి క్లౌడ్ ల్యాప్‌టాప్‌.. ధర 15 వేలు మాత్రమే!

Jio Cloud Laptop

Jio Cloud Laptop

Reliance Jio to Launch Cloud Laptop Soon in India: టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన ‘రిలయన్స్ జియో’.. బడ్జెట్ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌లను తీసుకొస్తోంది. ఇప్పటికే జియో బుక్‌, జియో బుక్‌ 4జీ ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చిన జియో.. మరో కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఓ నివేదిక ప్రకారం… క్లౌడ్ ల్యాప్‌టాప్‌ను మార్కెట్‌లోకి సుమారు రూ. 15,000 ధరతో లాంచ్ చేయనుంది. ప్రస్తుతం మార్కెట్లో లాప్ టాప్ ధర కనీసం రూ.50 వేలు పలుకుతున్న సంగతి తెలిసిందే.

ముకేశ్ అంబానీకి చెందిన టెలికమ్యూనికేషన్స్ సంస్థ రిలయన్స్ జియో.. కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రముఖ ల్యాప్‌టాప్‌ తయారీ సంస్థలు హెచ్‌పీ, ఏసర్‌, లెనోవాలతో చర్చలు జరుపుతోందని ది ఎకనామిక్ టైమ్స్ ఒక నివేదిక తెలిపింది. ‘స్టోరేజ్‌, ప్రాసెసర్‌, చిప్‌సెట్‌, బ్యాటరీతో పాటు ఇతర హార్డ్‌వేర్‌ భాగాల ఆధారంగా ల్యాప్‌టాప్ ధరను నిర్ణయిస్తారు. వీటి ధర పెరిగితే.. ల్యాప్‌టాప్‌ ధర కూడా పెరుగుతుంది. వీటిని తగ్గించేందుకు జియో క్లౌడ్‌ పీసీని తీసుకొస్తున్నాం. ఈ ల్యాప్‌టాప్‌లో సిస్టమ్‌ ప్రాసెసింగ్ మొత్తం జియో క్లౌడ్‌లో జరుగుతుంది. దాంతో ల్యాప్‌టాప్‌ తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది’ అని కంపెనీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.

Also Read: OnePlus 12 Launch: వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ లాంచ్ డేట్ వచ్చేసింది.. సూపర్ ఫీచర్లు ఇవే!

జియో క్లౌడ్‌ ల్యాప్‌టాప్‌ కేవలం ఒక యాక్సెస్‌ డివైజ్‌ లానే పనిచేస్తుంది. ల్యాప్‌టాప్‌లో జరిగే ప్రాసెస్ అంతా బ్యాగ్రౌండ్‌లో జియో క్లౌడ్‌లో జరుగుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి హెచ్‌పీ క్రోమ్‌ బుక్‌లో టెస్టింగ్‌ చేస్తున్నారు. అయితే ఈ ల్యాప్‌టాప్‌ తక్కువ ధరకే వస్తున్నా.. క్లౌడ్‌ సేవలు వినియోగించుకోవడం కోసం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. జియో ల్యాప్‌టాప్‌ కాకుండా.. కేవలం జియో క్లౌడ్‌ పీసీ సాఫ్ట్‌వేర్‌ను కూడా కంపెనీ అందిస్తుంది. దీంతో యూజర్లు తమ ల్యాప్‌టాప్స్‌ లేదా స్మార్ట్ టీవీలో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని సేవలను పొందొచ్చు.
.