నిత్యం ప్రశాంతంగా వుండే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉలిక్కిపడింది. రావులపాలెంలో కాల్పుల కలకలం రేగింది. ఫైనాన్షియర్ ఆదిత్యరెడ్డిపై కాల్పులు జరిపారు దుండగులు.. నాటు బాంబులు, గన్ తో దాడికి ప్రయత్నం చేయడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలీక అంతా టెన్షన్ పడ్డారు. అయితే, దుండగుల దాడితో అప్రమత్తం అయిన ఫైనాన్షియర్ ఆదిత్యరెడ్డి ప్రతిఘటించడంతో గన్ మిస్ ఫైర్ అయింది. ఆ ప్రాంతంలో జనాలు రావడంతో పారిపోయారు దుండగులు.
రావులపాలెంకు చెందిన ఫైనాన్సియర్ గుడిమెట్ల ఆదిత్య రెడ్డి పై గుర్తుతెలియని ఇద్దరు దుండగులు అర్థరాత్రి వేళ నాటు బాంబులు తుపాకీతో దాడికి ప్రయత్నించారు. ఈ సమయంలో వారితో వాగ్వివాదానికి దిగిన ఫైనాన్షియర్ తిరగబడి ఎదురు తిరిగారు. దీనితో దుండగులు చేతిలో ఉన్న గన్ మిస్ ఫైర్ అయి గాలిలో పేలింది. పెద్ద శపథంతో ఈ కాల్పులకు చుట్టుపక్కల వాళ్లు రావడంతో నాటుబాంబులు బ్యాగ్ అక్కడే వదిలేసి దుండగులు పారిపోయారు .
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటన స్థలంలో దుండగులు వదిలి వెళ్ళిన బ్యాగులో సెల్ ఫోన్ జామర్ తో పాటు రెండు నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలకు గురి చేసింది బాధితుడు ఫిర్యాదుపై ..పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫైనాన్షియర్ గుడిమెట్ల ఆదిత్య రెడ్డిని హతమార్చడానికే దుండగులు పథకం ప్రకారం వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఫైనాన్షియర్ గుడిమెట్ల ఆదిత్య రెడ్డిని హత్య చేసి ఏ విధమైన ఆధారాలు లభించకుండా పరారు కావడానికి దుండగులు సెల్ ఫోన్ జామర్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు ఫైనాన్షియర్ కు దుండగులకు మధ్య ఆర్థిక లావాదేవీలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు . అయితే ఘటనకు సంబంధించి ఫైనాన్షియర్ గుట్టు విప్పకపోవడంతో మిస్టరీగా ఉంది..దుండగులు ఏవరో తెలియదని ఫైనాన్షియర్ చెప్పడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కాల్పులపై స్థానికుల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.