Ashwin: “అన్యాయం జరుగుతోంది.. ప్లేయర్స్‌ని ఒకేలా చూడటం లేదు”.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..

Ashwin Questions Gambhir

Ashwin Questions Gambhir

Ravichandran Ashwin: టీమిండియాలో ఆటగాళ్లను నిరంతరం మార్చే చాప్ అండ్ చేంజ్ (Chop and change) సంస్కృతిపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సంజూ విషయంలో అన్యాయం జరిగిందని.. ఆటగాళ్లందరినీ ఒకేలా చూడటం లేదంటూ మండిపడ్డాడు. వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం మంచిదే అయినప్పటికీ, కొద్ది నెలల క్రితమే టీ20 వరల్డ్ కప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజు శామ్సన్‌పై వేటు వేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించాడు. జట్టులో చోటు గురించి ఆటగాళ్లలో అభద్రతా భావం (Insecurity) పెంచడం టీమిండియాకు చాలా ప్రమాదకరమని హెచ్చరించాడు. ప్రముఖ జర్నలిస్ట్ విమల్ కుమార్‌తో తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్‌తో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు జట్టు నుంచి తదుపరి బలయ్యే ఆటగాడు ఎవరంటూ సెలెక్టర్లను నిలదీశాడు. “తర్వాతి వంతు ఎవరిది? ఐర్లాండ్‌లో రెండు ఓటములు, ఆపై ఫామ్ కోల్పోయాడనే కారణంతో సంజు శామ్సన్‌ను పక్కన పెట్టారు. ఇప్పుడు ఇంగ్లాండ్‌లోనూ రెండు మ్యాచ్‌లు ఓడిపోయాం. మరి ఇప్పుడు ఎవరిపై వేటు వేస్తారు? ఇది నిజంగా తప్పు. భారత క్రికెటర్లు అభద్రతా భావంలో పడకూడదని నేను కోరుకుంటున్నాను. గతంలో సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు నుంచి తప్పించడంపై కూడా నేను మాట్లాడాను. ఆటగాళ్లలో జట్టు కంటే తమ స్థానం గురించే భయం మొదలైతే.. వారు కేవలం తమ చోటును కాపాడుకోవడం కోసమే ఆడతారు. టీ20 క్రికెట్‌లో ఇది అత్యంత ప్రమాదకరం” అని అశ్విన్ హెచ్చరించాడు.

ఒకవేళ సంజు శామ్సన్‌కు మళ్లీ అవకాశం ఇస్తే.. అతను జట్టు కంటే తన వ్యక్తిగత స్కోరు కోసమే ఆలోచించే అవకాశం ఉందని, అలా జరిగితే అతడిని తప్పుపట్టలేమని అశ్విన్ అన్నాడు. టెస్టు జట్టులో సాయి సుదర్శన్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం గురించి మేనేజ్‌మెంట్ మాట్లాడిన మాటలను అశ్విన్ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. “టెస్టుల్లో సాయి సుదర్శన్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వడంపై మేనేజ్‌మెంట్ ఏమంది? ‘నాలుగు మ్యాచ్‌లను బట్టి ఒక ఆటగాడిని అంచనా వేయలేం’ అన్నారు. ఆ మాట చెప్పి నెల కూడా కాలేదు. మరి కేవలం 3 లేదా 4 మ్యాచ్‌ల్లో పరుగులు చేయలేదని సంజూను ఎలా పక్కన పెడతారు? ఆటగాళ్లందరినీ ఒకేలా చూడకపోయినా, అతనికి కనీసం మరో రెండు అవకాశాలు ఇవ్వాల్సింది” అని అన్నాడు. అసలు సంజూకు రెస్ట్ ఇవ్వడంపై కూడా అశ్విన్ మండిపడ్డాడు. “అసలు రెస్ట్ అంటే ఏంటి? సంజు శాంసన్ కేవలం టీ20లు మాత్రమే ఆడుతున్నాడు, టెస్టులు లేదా వన్డేలు ఆడటం లేదు. అలాంటప్పుడు అతనికి విశ్రాంతి ఎందుకు? జింబాబ్వే పర్యటన ముగిశాక తిరువనంతపురంలో ఉన్న తన సొంత ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటాడు. కేవలం టీ20లు మాత్రమే ఆడే ఆటగాడు విశ్రాంతి ఎందుకు కోరుకుంటాడు? ఇదంతా చాలా అన్యాయం” అని అశ్విన్ స్పష్టం చేశాడు.