చుట్టూ చిమ్మ చీకటి.. అమ్మా.. అమ్మా.. అని వెక్కి వెక్కి ఏడుస్తున్నా తల్లి లేవడం లేదు. అసలు ఎక్కడ ఉన్నామో తెలియదు.. దిక్కులు పిక్కటిల్లేలా ఆ చిన్నారి గుక్క పెట్టి ఏడ్చింది. కానీ ఆ చిన్నారి రోదన అరణ్యంలో ఆర్తనాదం లాగే మిగిలిపోయింది. తెల్లారిన తర్వాత స్థానికులు వచ్చి చూసే సరికి.. తల్లి శవంగా పడి ఉంది. ఆ పక్కనే చిన్నారి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడి ఉంది. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది? ఆ తల్లిని చంపిందెవరు? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది..?
అది రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం దేవునిపల్లి పరిధిలోని రంగారెడ్డిగూడ ప్రాంతం. ఉదయం పూట అటుగా వెళ్తున్న స్థానికులకు ఓ పొలంలో మహిళ డెడ్బాడీ కనిపించింది. ఆ పక్కనే తల్లి కోసం ఏడుస్తున్న చిన్నారిని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు షురూ చేశారు. పోలీసుల దర్యాప్తులో మహిళను రంగారెడ్డిగూడకు చెందిన శోభగా గుర్తించారు.
Also Read:BCCI: కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. నిజామాబాద్లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు..
రంగారెడ్డిగూడకు చెందిన శోభకు పదేళ్ల క్రితం మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండవాసితో పెళ్లి జరిగింది. వారికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. గొడవలతో మూడున్నరేళ్ల క్రితం భర్తతో విడిపోయిన ఈమె అదే గ్రామానికి చెందిన నర్సింహులుతో సహజీవనం చేస్తోంది. తర్వాత పాప మమత పుట్టింది. ప్రస్తుతం ఆ చిన్నారికి రెండున్నరేళ్లు. శోభకు నర్సింహులుతో కూడా కలహాలు రావడంతో పుట్టింటికి వచ్చి తల్లితో కలిసి ఉంటోంది.
నర్సింహులు ఆమె కుమారుడికి సైకిల్ ఇప్పిస్తానని షాద్నగర్కు రమ్మన్నాడు. కుమారుడితో కలిసి అక్కడికి చేరుకున్న శోభ సాయంత్రం వరకు నర్సింహులు రాకపోవడంతో ఇంటికి వెళ్లిపోయింది. కుమారున్ని ఇంట్లోనే ఉంచి కుమార్తెతో కలిసి మళ్లీ కోయిలకొండకు బయలుదేరింది. తిరిగి వెళ్తున్న ఆమెను విరన్నపేట్ వద్ద కలిసిన నర్సింహులు మళ్లీ ఇంటికి తీసుకొని వచ్చాడు. ఐతే ఇంటికి వచ్చిన అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశంలో నర్సింహులు ఆమె తలపై బలంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. ఆమె చనిపోవడంతో రాత్రి 9 గంటల సమయంలో బైక్పై ముందు డెడ్బాడీని పడుకోబెట్టి ఆమెపై ఒక బట్ట కప్పాడు. పాపను కూడా బైక్పై కూర్చోబెట్టుకుని షాద్నగర్ సమీపం వరకు వెళ్లి అక్కడే ఆమెను పడేశాడు. పాపను కూడా అక్కడే వదిలేసి నర్సింహులు వెళ్లిపోయాడు. అలా బైక్పై తీసుకు వెళ్లిన దృశ్యాలు.. సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
