Alluri Sitarama Raju International Airport: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారంగా నిలుస్తుందని, ఈ ప్రాజెక్టుతో వేలాది మంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని “ఎర్రబస్సులు తిరిగే ప్రాంతం” అంటూ కొందరు హేళన చేశారని, ఇప్పుడు అదే ప్రాంతంలో ఎయిర్బస్లు తిరిగే స్థాయికి ఉత్తరాంధ్ర చేరుకుందని వ్యాఖ్యానించారు.
దేశంలో ఎక్కడా లేనంత వేగంగా ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరుగుతోందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రపంచం గర్వించే నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ 2047కు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. ప్రధాని మోడీ సారథ్యంలో వికసిత్ భారత్ లక్ష్యాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజన్ 2047ను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు..

