బిహార్లోని క్రికెట్ ప్రేమికులకు , క్రీడాకారులకు దశాబ్దాలుగా ఉన్న ఒక గొప్ప కల నెరవేరబోతోంది. బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలోని చారిత్రాత్మక రాజ్గిర్ నగరంలో నిర్మిస్తున్న “రాజ్గిర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం” పనులు వేగంగా ముగింపు దశకు చేరుకున్నాయి. డిసెంబర్ 2026 నాటికి ఈ స్టేడియాన్ని అన్ని రకాలుగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర క్రీడా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
సుమారు 90 ఎకరాల వైశాల్యంలో, రూ. 633 కోట్ల భారీ అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో క్రికెట్ స్టేడియం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ స్టేడియంలోని మెయిన్ పెవిలియన్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఏకకాలంలో 40 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్లను వీక్షించేలా దీనిని రూపొందిస్తున్నారు. రాత్రి వేళల్లో మ్యాచ్ల కోసం అత్యాధునిక ఫ్లడ్లైట్లు, హై-టెక్ ఎలక్ట్రానిక్ స్కోర్బోర్డులు, కార్పొరేట్ బాక్స్లు, మీడియా సెంటర్, ప్లేయర్ల కోసం విలాసవంతమైన డ్రెస్సింగ్ రూమ్లు ఉంటాయి. మ్యాచ్ పిచ్ కోసం నాణ్యమైన ఎర్ర మట్టిని, ప్రాక్టీస్ పిచ్ల కోసం నల్ల మట్టిని ఉపయోగిస్తున్నారు. వర్షం పడితే నీరు త్వరగా బయటకు పోయేలా అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
స్థానిక ప్రాతిభకు ప్రపంచ స్థాయి వేదిక..
ఈ స్టేడియం అందుబాటులోకి వస్తే బిహార్కి చెందిన ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ, ముకేష్ కుమార్, ఆకాష్ దీప్ వంటి స్టార్ క్రికెటర్లు తమ స్వరాష్ట్రంలోనే జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే అవకాశం లభిస్తుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానిక క్రీడాకారులకు ఇక్కడే అత్యుత్తమ శిక్షణ లభిస్తుంది.
క్రీడా శాఖ మంత్రి శ్రేయసి సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్టేడియం కేవలం ఆటలకే కాకుండా బీహార్ క్రీడా రంగానికి ఒక కొత్త గుర్తింపుగా మారనుంది. రాజ్గిర్ కాంప్లెక్స్లో క్రికెట్తో పాటు హాకీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, షూటింగ్, కబడ్డీ వంటి అనేక ఆటలకు ఇప్పటికే వసతులు కల్పించారు. దీనివల్ల ప్రాంతీయ పర్యాటకం, ఉపాధి అవకాశాలు పెరిగి బీహార్ ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపు వస్తుందని భావిస్తున్నారు.

