Rajat Patidar: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును ఐపీఎల్లో సాధారణ పోటీదారుల స్థాయి నుంచి వరుస ఛాంపియన్గా మార్చిన నాయకుడు ‘రజత్ పాటిదార్’ (Rajat Patidar). 2025 సీజన్లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతడు బ్యాటర్గా, కెప్టెన్గా అసాధారణ ప్రదర్శన కనబరుస్తూ జట్టుకు విజయాల బాట చూపిస్తున్నాడు. గత రెండేళ్లుగా ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా మారడంలో పాటిదార్ పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసి ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. గత ఏడాది పంజాబ్ కింగ్స్ను ఫైనల్లో ఓడించిన బెంగళూరు జట్టు, ఈసారి గుజరాత్ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి చరిత్ర సృష్టించింది. ఈ విజయానికి వెనుక పాటిదార్ నాయకత్వం ప్రధాన కారణమని భావించవచ్చు. ఈ విజయంతో రాజత్ పాటిదార్ ఐపీఎల్ చరిత్రలో టైటిల్ను విజయవంతంగా డిఫెండ్ చేసిన మూడో కెప్టెన్గా నిలిచాడు. అంతకుముందు ఈ ఘనతను కేవలం మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ మాత్రమే సాధించారు.
ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011 సీజన్లలో వరుసగా టైటిళ్లు గెలుచుకుంది. అలాగే రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ 2019, 2020 సీజన్లలో బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్గా నిలిచింది. ఇప్పుడు 2025, 2026 సీజన్లలో ఆర్సీబీని వరుస టైటిళ్ల వైపు నడిపించి పాటిదార్ ఈ అరుదైన జాబితాలో చేరాడు. అయితే రాజత్ పాటిదార్ సాధించిన ఘనత ఇక్కడితో ఆగలేదు. ధోనీ, రోహిత్లకు కూడా సాధ్యం కాని ప్రత్యేక రికార్డును అతడు తన పేరిట నమోదు చేసుకున్నాడు. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తొలి రెండు సీజన్లలోనే రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన తొలి నాయకుడిగా పాటిదార్ నిలిచాడు.
2025లో ఆర్సీబీ కెప్టెన్గా నియమితుడైన పాటిదార్, అదే ఏడాది జట్టుకు తొలి ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. ఆ తర్వాత 2026లో కూడా జట్టును ఛాంపియన్గా నిలబెట్టి టైటిల్ను కాపాడుకున్నాడు. దీంతో తన కెప్టెన్సీ ప్రయాణాన్ని వరుస రెండు టైటిళ్లతో ప్రారంభించిన ఏకైక కెప్టెన్గా చరిత్రలో నిలిచిపోయాడు. ఇక ధోనీ 2008లో చెన్నై కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినా తొలి టైటిల్ కోసం 2010 వరకు వేచి చూడాల్సి వచ్చింది. రోహిత్ శర్మ 2013లో ముంబై ఇండియన్స్కు టైటిల్ అందించినప్పటికీ, తదుపరి ట్రోఫీని 2015లోనే గెలుచుకున్నాడు. కానీ పాటిదార్ మాత్రం తొలి రెండు సీజన్లలోనే రెండు కిరీటాలు అందుకుని కొత్త చరిత్రను నెలకొల్పాడు.
ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తొలి రెండు సీజన్లలో వరుసగా రెండు ఫైనల్స్కు జట్టును చేర్చిన రెండో నాయకుడు కూడా పాటిదారే. ఈ ఘనతను అంతకుముందు హార్దిక్ పాండ్యా మాత్రమే సాధించాడు. హార్దిక్ సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ 2022, 2023 సీజన్లలో వరుసగా ఫైనల్స్కు చేరింది. అయితే 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చివరి ఓవర్లో ఓటమిపాలై బ్యాక్ టు బ్యాక్ టైటిళ్లను చేజార్చుకుంది. కానీ పాటిదార్ మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోకుండా వరుసగా రెండు టైటిళ్లను గెలిచి తన కెప్టెన్సీ ప్రతిభను చాటుకున్నాడు. ఎన్నో సంవత్సరాల పాటు ఐపీఎల్ ట్రోఫీ కోసం ఎదురుచూసిన ఆర్సీబీ అభిమానులకు రాజత్ పాటిదార్ స్వర్ణయుగాన్ని తీసుకొచ్చాడు. ఒకప్పుడు టైటిల్కు దూరంగా ఉండే జట్టును ఇప్పుడు వరుస ఛాంపియన్గా మార్చి.. ఐపీఎల్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.
