ఈ నెల 11న ఉత్తర, మధ్య బంగాళాఖాతం దగ్గరలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్, మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ.
ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక అటు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎగువన కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, లక్ష్మీ బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరుతో్ంది. దీంతో గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది.
