హాస్య నటుడు రాహుల్ రామకృష్ణ ఎప్పుడూ మాట్లాడిన ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా మాట్లాతుంటారు. ఇందులొ బాగంగా తాజాగా సినిమా ఇండస్ట్రీలో మారుతున్న పరిస్థితులు, ప్రేక్షకుల అభిరుచిపై ఆయన చేసిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిత్ర పరిశ్రమలోని లోపాలను వేలెత్తి చూపుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
రాహుల్ రామకృష్ణ తన ట్వీట్లో ప్రధానంగా సినిమాల నాణ్యతపై దృష్టి పెట్టారు.. ‘థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయని బాధపడటం మానేసి, మనం ఎంత చెత్త సినిమాలు తీస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి’ అంటూ మేకర్స్కు చురకలు అంటించారు. నేటి కాలంలో ఒక సామాన్యుడు థియేటర్కు రావడం అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని.. ఎండలు, ట్రాఫిక్, పెట్రోల్ ధరలు, పార్కింగ్ సమస్యలు.. ఇవన్నీ దాటుకుని థియేటర్కు వచ్చిన ప్రేక్షకుడికి అక్కడ కూడా భారీ ధరలు ఉండే స్నాక్స్, టికెట్ రేట్ల భారం ఎదురవుతుందని, ఇంతా చేసి వాళ్లకు నాసిరకం సినిమా చూపిస్తే వారు మళ్ళీ ఎందుకు వస్తారని ప్రశ్నించారు.
సినిమా మేకింగ్ గురించి ప్రేక్షకులకు ఏమీ తెలియదు అనుకోవడం మేకర్స్ భ్రమ అని రాహుల్ స్పష్టం చేశారు. డిజిటలైజేషన్ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరికీ టెక్నికల్ అంశాలపై అవగాహన పెరిగిందని, ఎవరూ అమాయకులు కాదని హెచ్చరించారు. పాతకాలపు కథలు, అహంకారంతో కూడిన మేకింగ్ పద్ధతులను వీడితేనే థియేటర్ల మనుగడ సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటీటీల కాలంలో కేవలం గొప్ప కంటెంట్ ఉంటేనే జనం బయటకు వస్తారనే రాహుల్ మాటలను నెటిజన్లు ఏకీభవిస్తూ మద్దతు తెలుపుతున్నారు.
