ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్‌గా సరికొత్త టీం బరిలోకి.!

  • యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో డబ్లిన్ గార్డియన్స్ యజమానిగా రాహుల్ ద్రవిడ్
  • డబ్లిన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్న రవిచంద్రన్ అశ్విన్
  • యూరప్‌లో క్రికెట్ అభివృద్ధే ETPL ప్రధాన లక్ష్యమని తెలిపిన ద్రవిడ్
  • మొత్తం ఆరు జట్లు పాల్గొననున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్..
Etpl Dublin Guardians

Etpl Dublin Guardians

ETPL Dublin Guardians: భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో కీలక పాత్ర పోషించనున్నారు. డబ్లిన్ గార్డియన్స్ ఫ్రాంచైజీ యజమానిగా ద్రవిడ్‌ను అధికారికంగా ప్రకటించారు. యూరప్‌లో క్రికెట్ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభిస్తున్న ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ.. “యూరప్‌లో క్రికెట్‌ను మరింత బలోపేతం చేయడం, యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం ETPL ప్రధాన లక్ష్యం. అదే నన్ను ఈ లీగ్ వైపు ఆకర్షించింది. డబ్లిన్‌లో ఇప్పటికే క్రికెట్‌కు మంచి ఆదరణ ఉంది. భవిష్యత్ తరానికి మంచి వేదికగా ఈ లీగ్ మారుతుంది” అని తెలిపారు.

డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టు బెల్‌ఫాస్ట్, ఎడిన్‌బర్గ్, గ్లాస్గో, రోటర్‌డామ్, ఆమ్స్‌టర్‌డామ్ జట్లతో పోటీపడనుంది. ఈ టోర్నీ ప్రారంభ కార్యక్రమానికి ETPL సహ వ్యవస్థాపకుడు అభిషేక్ బచ్చన్ తో పాటు పలువురు ఫ్రాంచైజీ యజమానులు హాజరయ్యారు. అలాగే జోంటీ రోడ్స్, క్రిస్ గేల్, స్టీవ్ వా వంటి దిగ్గజాలు కూడా ఈ లీగ్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. క్రికెట్ ఐర్లాండ్, క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ప్రారంభమవుతున్న ఈ లీగ్‌లో డబ్లిన్, బెల్‌ఫాస్ట్, ఎడిన్‌బర్గ్, గ్లాస్గో, రోటర్‌డామ్, ఆమ్స్‌టర్‌డామ్ నగరాల జట్లు పాల్గొంటాయి.

అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, ఫాఫ్ డు ప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్ తదితరులు కూడా ఈ లీగ్‌లో ఆడనున్నారు. ETPL తొలి సీజన్ ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు నిర్వహించనున్నారు. యూరప్‌లో క్రికెట్ విస్తరణకు ఈ లీగ్ కీలకంగా మారనుందని నిర్వాహకులు భావిస్తున్నారు.