పూరీ జగన్నాథ ఆలయ యాజమాన్య సంస్థ ఆలయ బ్యాంకు బ్యాలెన్స్కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించింది. అయోధ్య రామ్ మందిర విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. పారదర్శకతను చాటుకునేందుకు జగన్నాథుని పేరిట బ్యాంకుల్లో రూ. 1,912 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నట్లు ప్రకటించింది. ఆలయ నిధుల నిర్వహణ అత్యున్నత పారదర్శకతతో, క్రమబద్ధమైన ఆడిటింగ్, అకౌంటింగ్ పద్ధతుల ద్వారా జరుగుతోందని ఎస్జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరవింద కుమార్ పఢీ స్పష్టం చేశారు. భక్తుల నమ్మకాన్ని కాపాడేందుకు స్పష్టమైన జవాబుదారీతనం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఆలయానికి వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. భక్తులు సమర్పించే కానుకలు, విరాళాలు, ఆలయానికి చెందిన గనులు, క్వారీల ద్వారా వచ్చే ఆదాయం, ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ, భూముల లావాదేవీల ద్వారా లభించే ఆదాయంతో పాటు ప్రభుత్వ గ్రాంట్లు ప్రధాన వనరులుగా ఉన్నాయి. ఈ ఆదాయంలో కొంత భాగాన్ని కార్పస్ ఫండ్, ఫౌండేషన్ ఫండ్, టెంపుల్ ఫండ్ అనే మూడు విభాగాలలో ఫిక్స్డ్ డిపాజిట్లుగా జమ చేస్తారు. ఈ నిధుల నుంచి వచ్చే వడ్డీని ఆలయంలో రోజువారీ పూజలు, సాంప్రదాయక సేవలు మరియు పరిపాలనా వ్యయాల కోసం ఉపయోగిస్తారు.
ఆగస్టు 31, 2026 నాటికి ఎస్జేటీఏ వద్ద దాదాపు రూ. 1,912 కోట్ల విలువైన బ్యాంకు ఆస్తులు ఉన్నాయి. ఇందులో కార్పస్, ఫౌండేషన్, టెంపుల్ డిపాజిట్ల రూపంలో సుమారు రూ. 1,811 కోట్లు ఉండగా, మిగిలిన రూ. 100 కోట్లకు పైగా నిధులు సేవింగ్స్, కరెంట్ మరియు ఫ్లెక్సీ ఖాతాల్లో ఉన్నాయి. జూన్ 2024లో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ. 500 కోట్ల కార్పస్ ఫండ్ కూడా ఇందులో భాగమే. ఆలయ హుండీలో లభించే కానుకలను ప్రతిరోజూ లెక్కించి, ఆ వివరాలను డిజిటల్ బోర్డులలో, అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు. జూలై 15న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రారంభించిన ‘సమర్పణ్’ డిజిటల్ హుండీ ద్వారా ఇప్పటివరకు భక్తులు రూ. 56.7 లక్షల విరాళాలు అందించారు. నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు లేనప్పటికీ, భద్రతను మరింత కఠినతరం చేశారు.

