Site icon NTV Telugu

Punjab: పంజాబ్ గవర్నర్ షాకింగ్ నిర్ణయం

Punjab Governor

Punjab Governor

పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ (Banwarilal Purohit) షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. 83 ఏళ్ల బన్వరీలాల్.. వ్యక్తిగత కారణాల చేత తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాజీనామా లేఖను పంపించారు.

పంజాబ్ గవర్నర్ (Punjab Governor) మరియు చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ అయిన బన్వరీలాల్ పురోహిత్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారమే ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మరుసటి రోజే ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.

లేఖలో ఏముందంటే..
బన్వరీలాల్‌కు ప్రస్తుతం 83 ఏళ్లు. వ్యక్తిగత కారణాలు మరియు కొన్ని ఇతర కట్టుబాట్లతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. దయచేసి తన రాజీనామాను ఆమోదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పురోహిత్ గతంలో తమిళనాడు, అసోం రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. అలాగే మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. రెండు సార్లు బీజేపీ నుంచి, ఒకసారి కాంగ్రెస్ నుంచి లోక్‌సభకు వెళ్లారు. ప్రస్తుతం పురోహిత్ సెప్టెంబర్ 9, 2021 నుంచి పంజాబ్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు.

శనివారం ఒక రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఇంకోవైపు మరో రాజకీయ కురువృద్ధుడైన బన్వరీలాల్ పురోహిత్ పదవి నుంచి నిష్క్రమించారు.

Exit mobile version