Ketan Murder Case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేతన్ అగర్వాల్ హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తొలుత ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అని అనుకున్నప్పటికీ, అతడికి కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ కలిసి పక్కా ప్లాన్తో హత్య చేసినట్లు తేలింది. జూన్ 18న 26 ఏళ్ల కేతన్ను లోహగఢ్ కోటపై నుంచి సియా తోసేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెద్దలు కుదర్చిన పెళ్లి ఇష్టం లేకపోవడం, చేతన్లో లవ్ ఎఫైర్ కారణంగా కేతన్ను సియా హత్య చేసింది. ఇందుకోసం కేఫ్లో కలుసుకోవడం, ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, ఒకసారి హత్య కోసం విఫలయత్నం వంటి అంశాలను పోలీసులు విచారణలో గుర్తించారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం పోలీసుల ఆరోపణలు మాత్రమే, కోర్టులో నిరూపితమైతేనే నేరం రుజువు అవుతుంది.
కోర్టులో పోలీసులకు సవాల్..
ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో పోలీసులకు సవాల్గా మారింది. కేతన్ ఎవరు తోశారనే దానిపై ఇంకా స్పష్టమైన ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం, పోలీసులు వద్ద నిందితుల విచారణ సమయంలో ఒప్పుకున్న ఆధారాలు మాత్రమే ఉన్నాయి. అయితే, భారత చట్టాల ప్రకారం పోలీసుల ముందు ‘‘ఒప్పుకోలు’’ ఒక్కటే శిక్షకు సరిపోదు. దానికి బలమైన ఆధారాలు కావల్సి ఉన్నాయి. విచారణలో సియా, చేతన్లు ఒకరిపై ఒకరు నేరాన్ని తోసేసుకునే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.
ఈ ఆధారాలే కీలకం:
ఈ కేసులో పూర్తిగా ఆధారాలు పరిస్థితులపై ఆధారపడి ఉన్నాయి. ‘‘సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్’’పై ఈ కేసు ఆధారపడి ఉంది. ప్రతీ అంశాన్ని పోలీసులు కోర్టులో పక్కాగా నిరూపించాల్సి ఉంటుంది. సియా-చేతన్ మధ్య ప్రేమ సంబంధం ఉందా? , కేఫ్లో వీరు హత్య కోసం ప్లాన్ చేశారా?, ఫోన్ కాల్స్-చాట్స్-సీసీటీవీ ఫుటేజ్లు కుట్రను నిరూపిస్తున్నాయా?, ఘటన జరిగిన రోజు ఇద్దరు కలిసి ఉన్నారా? , ఆధారాలు దాచే ప్రయత్నం చేశారా? అనే అంశాలను పోలీసులు కోర్టులో నిరూపించాల్సి ఉంటుంది.
ఈ కేసులో ప్రధాన ప్రశ్న ఇదే:
ఈ కేసులో అత్యంత కీలకమైన ప్రశ్న అసలు కేతన్ ప్రమాదవశాత్తు కిందపడ్డాడా? లేక ఉద్దేశపూర్వకంగా తోసేశారా? అనేది కీలకంగా మారింది. ఈ విషయాన్ని నిరూపించడానికి కేతన్ పడిపోయిన ప్రాంతం, కొండ అంచు, అతని చెప్పులు, శరీర గాయాలు, కిందపడిన దిశ, ప్రమాదవశాత్తు జారిపడే అవకాశం ఉందా? లేదా? అనే అంశాలన్నింటిని పోలీసులు శాస్త్రీయంగా విశ్లేషించాల్సి ఉంటుంది.
మరో ఆరుషి కేసు అవుతుందా?
న్యాయ నిపుణుల ప్రకారం.. ఈ కేసులో ఆధారాలను నిరూపించడం పోలీసులకు సవాల్గా మారింది. కేవలం నిందితుల ఒప్పుకోలు మాత్రమే ఉండటం, ప్రత్యక్ష సాక్షి లేకపోవడం చిక్కుముడిని పెంచింది. ఈ కేసు కూడా మరో ఆరుషి-హేమ్రాజ్ హత్య కేసులా మారతుందా? అనే అనుమానాలు ఉన్నాయి. 2008లో ఆరుషి కేసులో తల్వార్ దంపతులు నిర్దోషులుగా విడుదలయ్యారు.
13 ఏళ్ల ఆరూషి తల్వార్, తల్వార్ల ఇంట్లో పనిమనిషిగా ఉన్న హేమరాజ్ బంజదే హత్యకు గురయ్యారు. ఆరూషి తల్లిదండ్రులు, రాజేష్ మరియు నూపుర్ తల్వార్లను 2013లో సీబీఐ కోర్టు దోషులుగా నిర్ధారించగా, నాలుగేళ్ల తర్వాత అలహాబాద్ హైకోర్టు వారిని నిర్దోషులుగా విడుదల చేసింది.
టీనేజ్ అమ్మాయి ఆరుషి తన బెడ్రూంలో, పనిమనిషి హేమ రాజ్ టెర్రస్పై శవాలుగా పడి ఉన్న ఈ కేసులో, హత్యలు జరిగిన రాత్రి తల్వార్ల ఇంట్లోకి బయటి వ్యక్తి ఎవరూ కూడా ప్రవేశించి ఉండరనే నిశ్చయంగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది.
కేసు నిరూపణలో కీలకంగా పంచశీల సూత్రాలు:
హత్యను నిరూపించడానికి భారత చట్టం ప్రకారం ప్రత్యక్ష సాక్షి లేదా వీడియో రికార్డింగ్ అవసరం లేదు. న్యాయస్థానాలు పరిస్థితుల ఆధారిత సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని శిక్ష విధించగలవు. అంటే ఒక హత్యకు దారి తీసే పరిస్థితులు నిరూపించబడాలి. ప్రతీ అంశం కూడా సహేతుకంగా ఉండాలి. ఒక చైన్ మిస్ అయినా కూడా కేసు బలహీనపడిపోతుంది. అందుకే ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది.

