వచ్చే నెల 5 నుంచి ప్రారంభమయ్యే పవన్ కల్యాణ్ బస్ యాత్రకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పవన్ కోసం ప్రత్యేకంగా బస్ తయారు చేస్తున్నారు. హైదరాబాద్ లో తయారు చేస్తున్న ఈ బస్సు ఎన్టీఆర్ చైతన్య రధాన్ని పోలి ఉంది. ఇప్పటి వరకూ బస్ యాత్ర చేసిన వివిధ పార్టీలు నేతలు వాడిన బస్సు లకు భిన్నంగా ఈ బస్సు ను డిజైన్ చేశారు. రెగ్యులర్ బస్ లు, లారీలకు వాడే పెద్ద టైర్లు దీనికి వాడారు. వర్క్ షాపులో తయారు అవుతున్న ఈ బస్ ఎక్స్క్ క్లూజివ్ ఫోటో ఎన్టీవీకి అందింది. తుది దశ హంగులు అద్దుకుంటున్న ఈ బస్సును ఈ నెల 26 వరకు పూర్తి స్థాయిలో రెఢీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బస్ కే ప్రత్యేకంగా సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. ఎంత దూరంలో ఉన్న వారికి కూడా పవన్ కనిపించేలా బస్ టాప్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాత్ర జరిగినన్ని రోజులు పవన్ ఇందులోనే ఉంటారు కాబట్టి ఆయన అలవాట్లు, అవసరాలకు తగ్గట్టుగా ఇందులో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచుతున్నారు.
యాత్రను ఎక్కడ నుంచి ప్రారంభించాలనేది ఈ నెల 18న ఖరారు చేస్తారు. అలాగే యాత్ర ఎన్ని విడతలుగా జరగాలి..? ఏఏ మార్గాల్లో ఎన్ని రోజుల యాత్ర జరగాలి? అనే దానిపై కసరత్తు జరుగుతోంది. ఈ నెల 18న మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయంలో కీలక నేతల సమావేశం జరుగనుంది. సమావేశం తర్వాత యాత్ర పూర్తి షెడ్యూల్ ను విడుదల చేస్తారు. 2014 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టిన పవన్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం అయ్యారు. ఈసారి వైసీపీని ఓడించడమే లక్ష్యమని.. అందుకు ప్రతిపక్ష, ప్రభుత్వవ్యతిరేక ఓట్లలో చీలినివ్వబోనని చెప్పిన పవన్… అందుకు బస్ యాత్రతో శ్రీకారం చుడుతున్నారు.
