Site icon NTV Telugu

Petrol Rate Hike: వాహనదారులకు బిగ్ షాక్… పెట్రోల్ ధరలు పెంపు..

Petrol Rate

Petrol Rate

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో.. చమురు సంస్థలు ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ. 2 నుంచి రూ. 2.30 వరకు పెంచాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొనడం వల్ల ఈ ప్రభావం పడింది. కొత్త ధరలు మార్చి 20, 2026 నుంచి అమలులోకి వచ్చాయి.

హెచ్‌పి (HP) వారి ‘పవర్’, ఇండియన్ ఆయిల్ (IOC) వారి ‘XP95’ వంటి ఖరీదైన పెట్రోల్ రకాలు ఇప్పుడు మరింత ప్రియమయ్యాయి. సాధారణంగా ఇంజిన్ పనితీరు బాగుండాలని, మైలేజీ పెరగాలని వాహనదారులు ఈ రకం పెట్రోల్ వాడుతుంటారు. అయితే.. సాధారణ పెట్రోల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

ప్రపంచ మార్కెట్లో పరిస్థితులు..

సముద్ర మార్గాల్లో నౌకల ప్రయాణం సురక్షితంగా ఉండేలా యూరప్ దేశాలు, జపాన్ సాయం చేస్తామని చెప్పడంతో శుక్రవారం చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. అమెరికా కూడా సరఫరా పెంచడానికి చర్యలు చేపట్టింది. అయినప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర ఇంకా 100 డాలర్ల పైననే ఉంది. గల్ఫ్ దేశాలలోని చమురు కేంద్రాలపై ఇరాన్ దాడులు చేయడంతో ఉత్పత్తి తగ్గి.. ఈ వారంలో ధరలు దాదాపు 5 శాతం పెరిగాయి.

ధరలను తగ్గించేందుకు అమెరికా మరిన్ని ప్రయత్నాలు చేస్తోంది. నిల్వ ఉంచిన చమురును బయటకు తీయడం వంటి మార్గాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 108.26 డాలర్లు, డబ్ల్యూటీఐ (WTI) ధర 95.27 డాలర్లుగా ఉంది.

భారత్‌పై ప్రభావం..

చమురు ధరలు గనుక బ్యారెల్‌కు 110 డాలర్లు దాటితే.. అది భారత ఆర్థిక వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల.. ప్రభుత్వ ఖర్చులు పెరుగుతాయి. ఒకవేళ ధర 110 డాలర్లు దాటితే.. అప్పుడు సాధారణ పెట్రోల్ ధరలను పెంచడం తప్పనిసరి అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version