Prasanna Kumar Reddy: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మరోసారి విమర్శలు చేసిన ప్రసన్న కుమార్‌ రెడ్డి!

  • ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మరోసారి ప్రసన్న కుమార్‌ రెడ్డి విమర్శలు
  • దాడులు చేసే సంస్కృతిని ప్రశాంతి రెడ్డి పరిచయం చేశారు
  • భయపడటం మా బయోడేటాలోనే లేదు
  • ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా, ఎవరోస్తారో రండి
Prashanthi Reddy Vs Prasanna Kumar Reddy

Prashanthi Reddy Vs Prasanna Kumar Reddy

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. డబ్బుందన్న అహంకారంతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్ది ఇలాంటి దాడులు చేయిస్తుందన్నారు. దాడులు చేసే సంస్కృతిని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లాకు పరిచయం చేశారని విమర్శించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఇప్పుడే వచ్చి అరెస్టు చేసుకోవచ్చన్నారు. తాను నెల్లూరు వదిలి వెళ్లి ఎక్కడో దాక్కున్నట్లు చెప్పడం హాస్యాస్పదం అని ప్రసన్న కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

ప్రసన్న కుమార్‌ రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ‘నాది నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి బ్లడ్‌. భయపడటం మా బయోడేటాలోనే లేదు. కేసులకు, అరెస్టులకు భయపడే మనస్తత్వం నాది కాదు. నేను నెల్లూరు వదిలి వెళ్లి ఎక్కడో దాక్కున్నట్లు ప్రచారం చేస్తున్నారు. చేతికి నొప్పి ఉంటే చెన్నైలోని చికిత్స చేయించుకుని వచ్చా. ఆస్పత్రికికి వెళ్తే.. నేను పారిపోయినట్లు ప్రచారం చేశారు. ప్రసన్న కాళ్లు, చేతులు కట్టేసి.. తన కాళ్ల కింద పడేయ్యమని ప్రశాంతి రెడ్ది చెప్పారట. నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా, ఎవరోస్తారో రండి. మా ఇంటిపై దాడికి వచ్చిన వారి వీడియోలు ఉన్నాయి. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలి’ అని ప్రసన్న కుమార్‌ రెడ్డి కోరారు.

Also Read: Lord’s Test: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో తెలుగోడి దెబ్బ.. వీడియో వైరల్!

కోవూరు నియోజకవర్గం పడుగుపాడులో జరిగిన వైసీపీ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేశారు. ప్రసన్న వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఖండించారు. ఎమ్మెల్యే ప్రశాంతి నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రసన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మరుసటి రోజు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్రసన్న నివాసంపై దాడికి పాల్పడ్డారు. ఇంటిలోని ఫర్నీచర్‌ సహా పలు కార్లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.