Pranay Amrutha: ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పును వెలువరించిన తర్వాత, ప్రణయ్ భార్య అమృత మొదటిసారి స్పందించారు. ఆమె భావోద్వేగాలతో నిండిన సందేశాన్ని సోషియల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “ఇన్నాళ్లుగా ఎదురుచూసిన న్యాయం నాకు చివరికి లభించింది. నా హృదయం భావోద్వేగాలతో నిండిపోయింది” అని అమృత తెలిపారు. కోర్టు తీర్పుతో తాను ఊపిరిపీల్చుకున్నానని, చాలా రోజులుగా ఎదురుచూస్తున్న న్యాయమే గెలిచిందని పేర్కొన్నారు.
Read Also: Assembly Sessions: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఈ తీర్పుతో పరువు కోసం జరిగే హత్యలు, ఇలాంటి దారుణాలు ఇకనైనా ఆగాలని అమృత ఆశాభావం వ్యక్తం చేశారు. తాము ఎదుర్కొన్న బాధను మరెవరూ అనుభవించకూడదని, సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. తన కుమారుడు పెద్దవాడవుతున్నందున, అతడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, అలాగే తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా మీడియా ముందుకు రావడం లేదని అమృత స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ కేసులో తనకు అండగా నిలిచిన పోలీస్ శాఖ, న్యాయవాదులు, ఇంకా మీడియాకు అమృత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. న్యాయం కోసం తనతో పాటు నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగా తన భర్త ప్రణయ్ను తలచుకుంటూ “ప్రశాంతంగా ఉండు ప్రణయ్” అని ఆమె సోషల్ మీడియా ద్వారా భావోద్వేగపూర్వకంగా ప్రకటించారు. ఈ సందేశం అందరినీ చలించిచేయడమే కాకుండా, ప్రణయ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలియజేసింది.