Rs 1 lakh power bill shocks Poor Farmer Family in AP: సాధారణంగా గ్రామాల్లో కరెంట్ బిల్లు రూ. 300-500 దాటదు. రెండు బల్బులు, ఓ ఫ్యాన్ ఉండే ఇంట్లో మరింత తక్కువగా వస్తుంటుంది. పేద రైతుల ఇంట్లో అయితే రూ. 200 కూడా రాదు. ఎందుకంటే.. ఉదయం అంతటా పనుల కోసం పొలానికి వెళ్లే వారు రాత్రి మాత్రమే కరెంట్ వాడుతుంటారు. అయితే ఓ పేద రైతుకు భారీగా కరెంట్ బిల్లు వచ్చింది. ఒకటి వెయ్యి కాదు, రెండు వేలు కాదు.. ఏకంగా లక్షా 5 వేల 352 రూపాయల కరెంట్ బిల్లు చూసి ఆ రైతు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ ఘటన ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం… అల్లూరి ఏజెన్సీ పాడేరు మండలం వనుగుపిల్లి పంచాయతీ పరిధిలోని చింటగున్నలు గ్రామంలో పాంగి సుందర రావు నివాసం ఉంటున్నాడు. సుందర రావు వ్యవసాయం చేస్తుంటాడు. పేద గిరిజన రైతు అయిన ఆయన.. తన ఇంట్లో రెండు బల్బులు, ఓ ఫ్యాన్ తప్ప ఇతర విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించడు. టీవీ, ఫ్రిడ్జ్ లాంటి సాధారణ ఉపకరణాలు ఏమీ ఇంట్లో లేవు. పొలం పనులకు వెళ్లే సుందర రావు కుటుంబం రాత్రిపూట మాత్రమే కరెంట్ వినియోగిస్తారు. గిరిజనుడు కావడంతో సబ్సిడీ ఉంటుంది కాబట్టి.. సుందర రావుకు ప్రతినెల విద్యుత్ బిల్లు రూ. 300 దాటదు.
అయితే గత నెలలో వచ్చిన కరెంట్ బిల్లు చూసి సుందర రావు కుటుంబానికి బైర్లు కమ్మాయి. వందల్లో రావలసిన కరెంటు బిల్లు.. ఏకంగా లక్ష్య (లక్షా 5 వేల 352 రూపాయలు) దాటడంతో ఇంటిల్లిపాది షాక్కు గురయ్యారు. వ్యవసాయంపై ఆధారపడే తాను ఈ బిల్లు ఎలా చెల్లించాలని తల పట్టుకున్నాడు. ఇటీవల సీపీఎం రక్షణ భేరి యాత్రలో ఈ విషయాన్ని నాయకులు తెలుసుకున్నారు. అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా.. వారు వెరిఫై చేస్తున్నారు. లోపం ఎక్కడ జరిగిందో చూసి.. చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాంతో ఆ పేద రైతు కాస్త శాంతించాడు.