PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. ప్రభుత్వ వనరులను పొదుపుగా వాడాలన్న తన పిలుపును స్వయంగా అమలు చేశారు. ఇటీవల చేపట్టిన దేశీయ పర్యటనల్లో తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను ఏకంగా 50 శాతం తగ్గించుకున్నారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి రాజీ పడకుండానే, అనవసరపు ఖర్చులను తగ్గించవచ్చని నిరూపించారు. ఇటీవల వడోదర, గౌహతి పర్యటనల సందర్భంగా ప్రధాని కాన్వాయ్లో వాహనాల సంఖ్య గతంతో పోలిస్తే చాలా తక్కువగా కనిపించింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) నిర్దేశించిన భద్రతా ప్రోటోకాల్స్ను తూచా తప్పకుండా పాటిస్తూనే ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. అత్యవసర భద్రతా వాహనాలను యథావిధిగా ఉంచి, అదనపు వాహనాలను మాత్రం తగ్గించారు. ఇటీవల హైదరాబాద్లో ఆయన చేసిన ప్రసంగం తర్వాతే ఈ మార్పు తక్షణమే అమలులోకి రావడం విశేషంగా మారింది. వీవీఐపీల కదలికల వల్ల సాధారణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పాటు, పరిపాలనా దక్షతను మెరుగుపరచడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రధాని, తన సొంత కాన్వాయ్ను తగ్గించుకోవడం ద్వారా ఒక గొప్ప సంకేతాన్ని పంపారు. దీని ప్రభావం ఇప్పుడు ఇతర రాష్ట్రాలపై సైతం పడుతోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారుల కాన్వాయ్ సైజును సైతం తగ్గించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ వనరులను సద్వినియోగం చేసుకోవడం, అనవసరపు ఆడంబరాలకు స్వస్తి పలకడమే ఈ చర్యల సారాంశం. వాహనాల సంఖ్య తగ్గినప్పటికీ, ప్రధాని భద్రతా వ్యవస్థ మాత్రం అత్యంత పటిష్టంగానే ఉంటుందని ఏజెన్సీలు స్పష్టం చేశాయి. గతంలో హైదరాబాద్ ప్రసంగం సందర్భంగా ప్రధాని దేశ ఆర్థిక వ్యవస్థపై సైతం కొన్ని కీలక సూచనలు చేశారు. విదేశీ మార్పిడి ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు వచ్చే ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. అలాగే కరోనా సమయంలో అలవాటైన వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లను కొనసాగించాలని సూచించారు. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని పొదుపు చేయడం దేశ ప్రయోజనాలకు అత్యవసరమని మోడీ నొక్కి చెప్పారు.
