PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 14న ‘విభజన భీభత్స స్మృతి దినోత్సవం’ (Horrors of Partition Remembrance Day) సందర్భంగా ఆనాటి విషాదాన్ని అనుభవించిన బాధితులకు నివాళులు అర్పించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ.. భారత విభజన కాలం నాటి ఘటనలు దేశ చరిత్రలోనే ఎన్నో కుటుంబాల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసిన అత్యంత బాధాకరమైన ఘట్టమని పేర్కొన్నారు. ఆ సమయంలో ఎందరో తమ వారిని కోల్పోయారని, కుటుంబాలు విడిపోయాయని, లక్షలాది మంది నిరాశ్రయులై వలస వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైర్యం వీడకుండా పోరాడిన బాధితుల సాహసాన్ని ప్రధాని కొనియాడారు. విభజన తర్వాత సర్వస్వం కోల్పోయిన ప్రజలు మళ్లీ మొదటి నుంచి తమ జీవితాలను ప్రారంభించి, ఎదురైన అడ్డంకులను తమ విజయాలుగా మలుచుకున్నారని కొనియాడారు. వారి జీవన ప్రయాణం మానవ సంకల్ప బలానికి, పట్టుదలకు నిదర్శనమని చెప్పారు. అంతేకాకుండా, దేశాభివృద్ధిలో విభజన బాధితులు అందించిన అమూల్యమైన సహకారాన్ని ఆయన ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సమాజంలో సౌభ్రాతృత్వాన్ని, సామరస్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ స్మృతి దినోత్సవం మనందరిలో ఐక్యతను పెంపొందిస్తుందని, అందరం కలిసికట్టుగా ‘వికసిత భారత్’ నిర్మాణ దిశగా అడుగులు వేయాలని కోరారు. ఇదిలా ఉండగా.. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 14వ తేదీన ‘విభజన భీభత్స స్మృతి దినోత్సవాన్ని’ నిర్వహిస్తారు. 1947 నాటి విభజన సమయంలో సంభవించిన హింస, ప్రాణనష్టం, వలసల వల్ల అపారమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొన్న వారిని స్మరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 2021లో ఈ రోజును ప్రకటించింది. విభజన నాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూనే, రాబోయే తరాలకు సామాజిక ఐక్యత, శాంతి, సోదరభావం యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
विभाजन विभीषिका स्मृति दिवस पर उन सभी देशवासियों का हृदय से नमन, जिन्होंने उस वीभत्स दौर से निकलकर देश की प्रगति में अमूल्य योगदान दिया। उन्होंने अपने साहस और सामर्थ्य से दिखाया कि कैसे विपरीत परिस्थितियों में भी संकल्पों को सिद्ध किया जाता है। आइए, सद्भावना और एकजुटता की… pic.twitter.com/lzLu5wbiXb
— Narendra Modi (@narendramodi) August 14, 2026

