PM Modi Oath Ceremony LIVE Updates: మరికొన్ని గంటల్లో ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 7.15 నిమిషాలకు ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రమాణస్వీకారానికి ముందు పలువురు ఎన్డీయే నేతలు ఈ రోజు ఉదయం ప్రధాని మోడీ నివాసంలో కలిశారు. చిరాగ్ పాశ్వార్, పీయూష్ గోయల్, జై శంకర్, శివరాజ్ సింగ్ చౌహాన్, హెచ్డీ కుమారస్వామి మోడీని కలిసిన నేతల్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, ఇరుగుపొరుగు దేశాలకు చెందిన దేశాధినేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో సహా పలువురు అంతర్జాతీయ దేశాధినేతలు హాజరుకానున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ఛీప్ మల్లికార్జున ఖర్గేని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఇప్పటికే ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. జీ-20 సదస్సు మారిరిగానే మల్టీ లెవల్ భద్రతనను ఏర్పాటు చేశారు. డ్రోన్లు, స్నైపర్స్, పారామిలిటరీ సిబ్బంది, ఎన్ఎస్జీ కమాండోలు రాష్ట్రపతి భవన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఐదు కంపెనీల పారామిలిటరీ, ఢిల్లీ సాయుధ పోలీసుల జవాన్లలో సహా 2,500 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఢిల్లీలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గగనతల ఆంక్షలు విధించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథులు సాయంత్రం 5 గంటల నుండి రావడం ప్రారంభిస్తారు మరియు 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం ప్రారంభమవుతుంది.