Site icon NTV Telugu

Vande Bharat Express: దక్షిణ భారత్‌లో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్, కాశీ దర్శన రైలును ప్రారంభించిన ప్రధాని

Vande Bharat Express

Vande Bharat Express

Vande Bharat Express: బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న (KSR) రైల్వే స్టేషన్‌లో శుక్రవారం చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఇది దేశంలో ఐదో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కాగా.. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రైలు. ఈ రైలు పారిశ్రామిక కేంద్రమైన చెన్నై, బెంగళూరులోని టెక్- స్టార్టప్ హబ్, ప్రసిద్ధ పర్యాటక నగరం మైసూరు మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) తెలిపింది. బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును కూడా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

కర్ణాటక ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ కలిసి కర్ణాటక నుండి కాశీకి యాత్రికులను పంపేందుకు కృషి చేస్తున్న భారత్ గౌరవ్ పథకం కింద మొదటిసారిగా కర్ణాటక రాష్ట్రం ఏర్పాటు చేసింది. కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లను సందర్శించడానికి యాత్రికులకు సౌకర్యవంతమైన బసతో పాటు పర్యాటక ప్రదేశాల గురించి చక్కగా తెలుసుకోవచ్చని పీఎంవో వెల్లడించింది. బెంగుళూరులోని విధానసౌధలో సన్యాసి కవి కనకదాసు, మహర్షి వాల్మీకి విగ్రహాలకు ప్రధాని పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Shirdi Sai Temple: షిర్డీ సాయి భక్తులకు గొప్ప శుభవార్త.. ఇకపై బాబా సమాధిని నేరుగా తాకే అవకాశం

ఉదయం 11:30 గంటలకు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు 108 అడుగుల నాడప్రభు కెంపేగౌడ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం 12:30 గంటలకు బెంగళూరులో బహిరంగ సభ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు, తమిళనాడులోని దిండిగల్‌లో గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.బెంగళూరులో దాదాపు రూ. 5,000 కోట్లతో నిర్మించిన కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2ను ప్రధాని ప్రారంభించనున్నారు. పీఎంవో ప్రకారం, ఈ టెర్మినల్ వల్ల ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యం సంవత్సరానికి 5-6 కోట్ల వరకు పెరగనుంది. ప్రస్తుత సామర్థ్యం సుమారు 2.5 కోట్లు.

Exit mobile version