CM Revanth Reddy : విద్యతోనే సామాజిక మార్పు, రాజ్యధికారం

  • ఖైరతాబాద్‌లో ఫూలే దంపతుల విగ్రహావిష్కరణ
  • విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హామీ
  • కులగణనతో చరిత్ర సృష్టించామని వెల్లడి
  • చదువుతో రాజ్యాధికారం సాధించాలని పిలుపు
Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నెక్లెస్ రోడ్ చౌరస్తాలో మహాత్మా జ్యోతిబా ఫూలే, శ్రీమతి సావిత్రీబాయి ఫూలే దంపతుల విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఒకవైపు అంబేద్కర్, మరోవైపు ఫూలే, ఇంకోవైపు ఇందిరా గాంధీ విగ్రహాల కలయికతో నెక్లెస్ రోడ్ చౌరస్తా మహనీయుల స్ఫూర్తి కేంద్రంగా మారిందని కొనియాడారు. 136 సంవత్సరాల తర్వాత కూడా మనం ఫూలేను గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్ప మార్గదర్శియో ఆలోచించాలని, ఆ మహనీయుల స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరూ విద్యలో రాణించాలని పిలుపునిచ్చారు.

ముందస్తుగా ఫీజు రీయింబర్స్‌మెంట్..

విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డంకి కాకూడదని, తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని సీఎం తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిలిపివేయకుండా ఈ ఏడాది నుంచి క్రమం తప్పకుండా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ముందస్తుగానే రూ.2,400 కోట్లు, అలాగే బ్యాంకు ఖాతాల్లో రూ.250 కోట్లు అడ్వాన్స్ గా పెడుతోందని వెల్లడించారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం అనే పరిస్థితి ఇకపై ఉండదని హామీ ఇచ్చారు. చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలు (Skills) పెంచుకుంటే విదేశాలకు పంపించే బాధ్యత, క్రీడల్లో రాణిస్తే ఉద్యోగాలతో పాటు భారీ నగదు నజరానాలు అందించే బాధ్యత తనదని ‘రేవంతన్న’గా భరోసా ఇచ్చారు.

కుల గణనతో చరిత్ర సృష్టించాం.. బలహీన వర్గాలకు పిలుపు..

సమాజంలో జంతువులు, చేపల లెక్కలు కూడా ఉండేవి కానీ, బలహీన వర్గాల జనాభా ఎంత ఉందో స్పష్టమైన లెక్కలు లేవని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి , గొప్పలు చెప్పుకునే ప్రధాని మోదీకి సవాలు విసురుతూ.. గుజరాత్‌లో కూడా చేయని విధంగా తెలంగాణలో ధైర్యంగా బీసీ కుల గణన చేపట్టి బలహీన వర్గాల సంఖ్యను తేల్చామని చెప్పారు. అసెంబ్లీలో వ్యతిరేకతలు ఎదురైనా ప్రత్యేక కమిషన్‌ వేసి విజయవంతంగా సర్వే పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వాల ఆలోచన బీసీలను గొర్రెలు, బర్రెలు, చేపలు పట్టే పనులకే పరిమితం చేయాలని ఉండేదని, ఎందుకంటే చదువుకుంటే రాజ్యాధికారం అడుగుతారనే భయమే దానికి కారణమని విమర్శించారు.

చదువుకోవాలి.. రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి

యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు రాష్ట్రంలో సంచలనాత్మక సామాజిక మార్పుకు వేదికగా నిలవబోతున్నాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. “మీరంతా బాగా చదివి సమాజంలో మార్పు తీసుకురావాలి, ఎమ్మెల్యేలు , ప్రజాప్రతినిధులుగా ఎదిగి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి” అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఇలాంటి ప్రభుత్వాన్ని నిరంతరం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.