Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన

Petrol Pump Upi Payments

Petrol Pump Upi Payments

Petrol Pump UPI Payments: జేబులో పర్సు లేకున్నా సరే.. ఆ పర్సులో డబ్బులే లేకపోయినా అవసరం లేదు.. మొబైల్‌ జేబులో ఉండి.. బ్యాంకులో బ్యాలెన్స్‌, క్రెడిట్‌ కార్డులో లిమిట్‌ ఉంటే చాలు.. ఎక్కడపడితే అక్కడ.. ఎంతపడితే అంత UPI ద్వారా పేమెంట్ చేసేశారు.. అయితే, యూపీఐ చెల్లింపులపై కొత్తగా అమల్లోకి రానున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ (MDR) ఇప్పుడు అందరినీ టెన్షన్‌ పెడుతుంది.. దీనిపై పెట్రోల్ పంప్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఛార్జీల నుంచి ఇంధన విక్రయాలను పూర్తిగా మినహాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోతే రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులను స్వీకరించబోమని మధ్యప్రదేశ్ సహా పలు ప్రాంతాల డీలర్లు హెచ్చరిస్తున్నారు.

కొత్త నిబంధనల ప్రకారం అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన ఎంపిక చేసిన యూపీఐ వ్యాపార లావాదేవీలపై MDR అమలు కానుంది. సాధారణ పెద్ద వ్యాపారి చెల్లింపులకు 0.4 శాతం MDR ఉండగా, పెట్రోల్, రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్ వంటి కొన్ని విభాగాలకు రూ.2,000కు మించిన లావాదేవీలపై ఒక్కో చెల్లింపుకు రూ.5 ఫ్లాట్ MDRగా నిర్ణయించారు. రూ.2,000 వరకు ఇంధన చెల్లింపులకు MDR ఉండదు. అయితే పెట్రోల్ పంప్ డీలర్లు ఈ రూ.5 ఛార్జీని కూడా తమపై అదనపు భారంగా భావిస్తున్నారు. ఇంధన విక్రయాల్లో మార్జిన్లు పరిమితంగా ఉండటం, నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి కారణాలతో అదనపు లావాదేవీ ఛార్జీలను భరించడం కష్టమవుతుందని వారు చెబుతున్నారు. ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కూడా పెట్రోల్ పంపుల్లో జరిగే యూపీఐ చెల్లింపులపై MDR నుంచి పూర్తిస్థాయి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేసింది..

మధ్యప్రదేశ్ పెట్రోల్ పంప్ డీలర్లు మాత్రం ప్రభుత్వం MDRను ఉపసంహరించుకోకపోతే రూ.2,000కు మించిన పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లకు యూపీఐ చెల్లింపులను స్వీకరించబోమని ప్రకటించారు. ఈ నిర్ణయం అక్టోబర్ 16 నుంచి అమలు చేస్తామని వారు వెల్లడించారు.. ఈ పరిణామంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్‌ (CAIT) కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పెద్ద మొత్తంలో ఇంధనం కొనుగోలు చేసే వినియోగదారులకు యూపీఐ చెల్లింపుల సౌలభ్యం పరిమితం కావచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే MDR అనేది వినియోగదారుడిపై నేరుగా విధించే ఛార్జీ కాదని, ఇది వ్యాపారి చెల్లించాల్సిన రుసుమని ప్రభుత్వం స్పష్టం చేసింది.