Site icon NTV Telugu

Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

Petrol Price Hits Rs 321 In

Petrol Price Hits Rs 321 In

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపెడుతుంటే, భారతదేశంలో మాత్రం సామాన్యుడి జేబుకు చిల్లు పడే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడంతో.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 25 నుంచి రూ. 28 వరకు పెరిగే ప్రమాదం ఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ తన తాజా నివేదికలో హెచ్చరించింది.

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ముడి చమురు సరఫరాకు ఆటంకం కలగడం, ముఖ్యంగా ‘హర్మూజ్ జలసంధి’ వంటి కీలక మార్గాల్లో రవాణా నిలిచిపోవడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. గత కొంతకాలంగా ప్రభుత్వం చమురు ధరలను పెంచకుండా నియంత్రించినప్పటికీ.. పెరుగుతున్న రిఫైనరీ నష్టాల దృష్ట్యా ఈ పెంపు అనివార్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరిగినా, భారత్‌లో చమురు విక్రయ సంస్థలు (OMCs) ఇప్పటివరకు వినియోగదారులపై భారం వేయలేదు. దీనివల్ల పెట్రోల్‌పై లీటరుకు రూ. 18, డీజిల్‌పై రూ. 35 వరకు నష్టం వస్తోంది. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగానే.. అంటే ఏప్రిల్ 29 తర్వాత, ప్రభుత్వం రాత్రికి రాత్రే ఇంధన ధరలను సవరించే అవకాశం ఉందని కోటక్ ఈక్విటీస్ అంచనా వేసింది.

సాధారణంగా ఎన్నికల సమయంలో ధరలు పెంచకుండా స్థిరంగా ఉంచడం గతంలోనూ చూశాం. ముడి చమురు ధరలు పెరగడం వల్ల భారత్ దిగుమతి చేసుకునే చమురు బిల్లు రోజుకు సుమారు $190–210 మిలియన్ల మేర అదనంగా పెరుగుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర సుమారు రూ. 94.77 వద్ద, ముంబైలో రూ. 103.54 వద్ద ఉంది. ఒకవేళ కోటక్ ఈక్విటీస్ అంచనాలు నిజమైతే.. పెట్రోల్ ధరలు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరుకోవచ్చు. ఇది రవాణా ఖర్చులను పెంచి, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగేలా చేసే అవకాశం ఉంది.

Exit mobile version