మెగా డీఎస్సీ నియామకాల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై బహిరంగ చర్చకు రావాలని లోకేష్కు సవాల్ విసిరారు. కృష్ణా జిల్లాలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. ప్రభుత్వం ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.
మంత్రి నారా లోకేష్ విద్యాశాఖతో పాటు ఇతర శాఖల వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారని పేర్ని నాని విమర్శించారు. కంపెనీలు తీసుకొచ్చామని, ఉద్యోగాలు కల్పించామని, రెడ్ బుక్ గురించి వ్యాఖ్యలు చేస్తూ అన్ని విషయాల్లో తన పాత్ర ఉందని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కార్యకర్తల చప్పట్ల కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ‘సీఎం చంద్రబాబు చర్చకు వస్తే వైఎస్ జగన్ వస్తారు. నారా లోకేష్ చర్చకు వస్తే నేను సిద్ధంగా ఉన్నాను. దమ్ముంటే డీఎస్సీ అక్రమాలపై నాతో బహిరంగ చర్చకు రావాలి’ అని పేర్ని నాని సవాల్ చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన లోకేష్ మాటలు హద్దులు దాటుతున్నాయని, ప్రతి అంశంలో తానే చేశానని చెప్పుకోవడం సరికాదన్నారు.
డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని పేర్ని నాని ఆరోపించారు. జిల్లా కలెక్టరేట్లలో మెరిట్ జాబితాలను ఎందుకు ప్రదర్శించలేదని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో అర్హులకు కాకుండా అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపిస్తూ.. ఈ వ్యవహారంపై న్యాయస్థానం కూడా విచారణ జరపాలని సూచించిందన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిజాయితీగా ఉంటే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, ఆరోపణలు నిజమైతే మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. మంత్రి పదవి కోసం బోండా ఉమా ముచ్చట పడుతున్నారని, మీరు రాజీనామా చేసి ఆయనకు మంత్రి పదవి ఇవ్వండని పేర్ని నాని విరామర్శించారు.

