ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును అడ్డుపెట్టుకుని కొందరు అక్రమార్కులు పక్కదారి పడుతున్నారు. సామాన్య ప్రజల నమ్మకాన్ని, నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని నకిలీ సిఫారసు లేఖల దందాను తెరపైకి తెచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల ఆశ చూపి, డిప్యూటీ సీఎం సంతకాన్ని, లెటర్ హెడ్లను ఫోర్జరీ చేస్తూ అక్రమ సంపాదనకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి మోసపూరిత చర్యలు వ్యక్తులకు మాత్రమే కాకుండా.. ప్రభుత్వ ప్రతిష్టకు కూడా భంగం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలి నియోజకవర్గ పరిధిలో ఈ మోసాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నకిలీ లేఖల సృష్టి..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి జారీ అయినట్లుగా నకిలీ సిఫారసు లేఖలను అక్రమార్కులు సృష్టించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయక నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేందుకు ఈ లేఖలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ విషయం పార్టీ దృష్టికి వెళ్లడంతో అత్తిలికి చెందిన జనసేన నాయకులు వెంటనే అప్రమత్తమయ్యారు. పవన్ కళ్యాణ్ పేరును దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీసు స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
Also Read:Central Govt: ఎట్టకేలకు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం..
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నకిలీ లేఖలు ఎక్కడ తయారయ్యాయి? దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో టెక్నికల్ టీమ్ సాయంతో సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కేవలం అధికారిక నోటిఫికేషన్లు, పరీక్షల ద్వారానే జరుగుతుందని.. ఎవరైనా సిఫారసు లేఖల పేరుతో డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జనసేన నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
