Delhi: ఢిల్లీలోని షాదరా రైల్వే స్టేషన్లో రైలు ఎక్కే క్రమంలో జరిగిన ఘర్షణ ఒక ప్రయాణికుడి ప్రాణాలను బలితీసుకుంది. ప్లాట్ఫారమ్ నంబర్-3పై యోగా ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలోకి ఎక్కేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని కొందరు తోటి ప్రయాణికులు అత్యంత దారుణంగా కొట్టి చంపారు. ఈ దెబ్బలాటకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్కు చెందిన పంకజ్ ధామా అనే వ్యక్తి హరిద్వార్ వెళ్లేందుకు ఉదయం 6 గంటల ప్రాంతంలో షాదరా స్టేషన్కు చేరుకున్నాడు. యోగా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫారమ్ పైకి రాగానే జనరల్ బోగీలోకి ఎక్కేందుకు ప్రయాణికుల మధ్య ఒక్కసారిగా తోపులాట మొదలైంది. ఈ క్రమంలో పంకజ్కు కొందరు ప్రయాణికులతో స్వల్ప వివాదం తలెత్తింది. బోగీ గేటు వద్ద మొదలైన ఈ చిన్న గొడవ చూస్తుండగానే హింసాత్మకంగా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన తోటి ప్రయాణికులు పంకజ్పై దాడి చేసి, కిందపడేసి కాళ్లతో, చేతులతో విచక్షణారహితంగా బాదారు.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఘటనా స్థలంలో ఉన్న ఒక ఆర్పిఎఫ్ (RPF) కానిస్టేబుల్ జోక్యం చేసుకుని పంకజ్ను గుంపు నుంచి విడిపించారు. అయితే, ఆ తర్వాత అతడిని ప్లాట్ఫారమ్ ఫ్లోర్పై లాగి అలాగే వదిలేశారు. కింద పడిన సమయంలో పంకజ్ శరీరంలో స్వల్ప కదలికలు ఉన్నప్పటికీ, భద్రతా సిబ్బంది అతడిని అదే స్థితిలో వదిలేసి ముందుకు సాగిపోయారు. ప్లాట్ఫారమ్పై ఉన్న బాధ్యతాయుతమైన వ్యక్తులెవరూ సమయానికి అతడిని ఆసుపత్రికి చేర్చే ప్రయత్నం చేయలేదు. ఈ తీవ్రమైన నిర్లక్ష్యం వల్లే, సకాలంలో వైద్యం అందక పంకజ్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఓల్డ్ ఢిల్లీ రైల్వే పోలీస్ స్టేషన్ (PS ODRS) బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. పంకజ్ ధామాను వెంటనే తీవ్రమైన స్థితిలో జీటీబీ (GTB) ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రాథమిక వైద్య నివేదిక ప్రకారం, దాడి సమయంలో పంకజ్ అంతర్గత అవయవాలకు తీవ్రమైన గాయాలు కావడమే మరణానికి ప్రధాన కారణమని తేలింది. న్యూఢిల్లీ రైల్వే డీసీపీ సచిన్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘోర కలకలంపై పోలీసులు తక్షణమే స్పందించి కొత్త చట్టం ‘భారతీయ న్యాయ సంహిత’ (BNS) సెక్షన్ 105 (హత్య కాని నేరపూరిత నరహత్య), సెక్షన్ 3(5) కింద కేసు నమోదు చేశారు. రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి, వారిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

