Mahesh Babu-Vinesh Phogat: పతకం ముఖ్యం కాదు.. మీరే నిజమైన ఛాంపియన్!

  • వినేష్‌ ఫోగట్‌పై అనర్హత వేటు
  • కోట్లాది మంది భారతీయులకు షాక్‌
  • పతకం ముఖ్యం కాదన్న మహేష్
Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu Supports Vinesh Phogat: పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేష్‌ ఫోగట్‌.. స్వర్ణ పతకం సాధిస్తుందని కోట్లాది మంది భారతీయులు కలలు కన్నారు. కానీ ఫైనల్ ముందు ఆమెపై అనర్హత వేటు పడటంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 50 కేజీల విభాగంలో పోటీ పడిన వినేశ్‌.. 100 గ్రాములు అదనంగా బరువు ఉన్నట్లు ఒలింపిక్ నిర్వాహకులు గుర్తించి అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి పోరాడిన వినేష్‌కు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు మద్దతిస్తున్నారు.

కరీనా కపూర్ ఖాన్, అలియా భట్, ఫర్హాన్ అక్తర్, సమంత రుతుప్రభు, తాప్సీ పన్ను, ఫాతిమా సనాషేక్, రకుల్ ప్రీత్ సింగ్, అనన్య పాండే.. పలువురు వినేష్ ఫోగట్‌కు ధైర్యం చెప్పారు. నవ్వు నిజమైన ఛాంపియన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మ‌హేశ్ బాబు కూడా వినేశ్‌కు అండ‌గా నిలిచారు. పతకం ముఖ్యం కాదని, మీరు నిజమైన ఛాంపియన్ అని కొనియాడారు. 1.4 బిలియన్‌ హృదయాలు మీతోనే ఉన్నాయని పేర్కొన్నారు.

‘నేటి ఫలితంతో సంబంధం లేదు. కానీ మీరు ఆ నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొన్నారో అది కచ్చితంగా మీ గొప్ప‌త‌నమే. వినేశ్‌ ఫొగట్‌.. మీరొక నిజమైన ఛాంపియన్‌ అని అందరికీ చూపించారు. కష్ట సమయాల్లో మీ ధైర్యం, బలం ప్రతిఒక్కరికి స్ఫూర్తి. ప‌త‌కం వ‌చ్చిందా లేదా అన్న‌ది ముఖ్యం కాదు. మీ స్ఫూర్తి మాలోని ప్ర‌తి ఒక్క‌రిలో ప్ర‌కాశిస్తుంది. 1.4 బిలియ‌న్ హృద‌యాలు మీతో పాటు ఉన్నాయి’ అని మ‌హేశ్ బాబు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం ప్రస్తుతం మహేష్ మేకోవర్ అవుతున్న విషయం తెలిసిందే.