ఆదివారం తెల్లవారుజామున ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలోని ఉగ్రవాద స్థావరాలపై లక్ష్యంగా దాడులు చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడులకు కారణమైన ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. ఈ వైమానిక దాడుల్లో అనేక మంది మరణించినట్లు సమాచారం. తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP), దాని అనుబంధ సంస్థలకు చెందిన ఏడు శిబిరాలపై సైన్యం ఇంటలిజెన్స్ బేస్డ్ సెలెక్టివ్ ఆపరేషన్లను నిర్వహించిందని పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ ఆదివారం ఉదయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ “X”లో ప్రకటించారు.
Also Read:Harish Rao: మెదక్లో గుండాల రాజ్యం నడుస్తుందా? ప్రభుత్వ పాలన నడుస్తుందా?
సరిహద్దు ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్-అఫ్లియేటెడ్ గ్రూప్ పై కూడా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. నంగర్హార్ ప్రావిన్స్లోని ఖోగ్యాని జిల్లాలో పాకిస్తాన్ జెట్లు అనేక వైమానిక దాడులు నిర్వహించాయి. పక్తికాలోని బర్మల్, అర్గున్ జిల్లాలతో పాటు నంగర్హార్లోని ఖోగ్యాని, బహ్సోద్, ఘని ఖేల్ జిల్లాల్లో అనేక వైమానిక దాడులు జరిగాయి. పాకిస్తాన్ దాడులు జరిగిన ఖచ్చితమైన స్థానాన్ని పేర్కొననప్పటికీ, సోషల్ మీడియా నివేదికలు ఈ దాడులు ఆఫ్ఘనిస్తాన్ లోనే జరిగాయని పేర్కొన్నాయి. దాడులకు సంబంధించి ఆఫ్ఘన్ ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ ఒక మదర్సాపై దాడి చేసిందని, దాడుల్లో 19 మంది పౌరులు మరణించారని ఆఫ్ఘన్ ప్రభుత్వం పేర్కొంది. దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆఫ్ఘనిస్తాన్ ప్రతిజ్ఞ చేసింది.
