Pakistan: పాకిస్తాన్ నెమ్మదిగా సైనిక పాలన దిశగా వెళ్తోంది. నిజానికి ఆ దేశంలో ప్రజాస్వామ్యం, ప్రధాని, మంత్రులు ఉన్నారని చెబుతున్నప్పటికీ, వీరంతా సైన్యం సూచన మేరకే నడుచుకుంటారనేది నిజం. ఇదిలా ఉంటే, ఇప్పుడు దాయాది దేశంలో 27వ రాజ్యాంగ సవరణతో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దేశం మొత్తం పాక్ ఆర్మీ చీఫ్, సర్వసైన్యాధికారి అసిమ్ మునీర్ చేతుల్లోకి వెళ్తోంది. ఈ కొత్త రాజ్యంగా సవరణ ద్వారా పాక్ అణ్వాయుధాలపై పూర్తి ఆధిపత్యం అసిమ్ మునీర్కు చేతుల్లోకి రాబోతోంది.
కొత్త చట్ట సవరణతో నేషనల్ స్ట్రాటిజక్ కమాండ్(ఎన్ఎస్సీ)పేరుతో కొత్తగా ఒక సంస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశ అణ్వాయుధాలు, వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థలు, వాటి నిర్వహణను ఒకే కమాండ్ కిందకు తెస్తోంది. ఇప్పటి వరకు అణ్వాయుధాలను ఉపయోగించే అధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ కమాండ్ అథారిటీ (NCA) పర్యవేక్షించేది. అయితే కొత్త వ్యవస్థలో ప్రధానమంత్రి పాత్ర కేవలం సమాచారం తెలుసుకునే స్థాయికి మాత్రమే పరిమితమవుతుంది. నిర్ణయాధికారం అంతిమంగా సైన్యానిదే.
ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ప్రస్తుతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF), చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) అనే రెండు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలోనే కొత్త వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. ఈ కొత్త వ్యవస్థ చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) రాకెట్ ఫోర్స్ నమూనాను పోలి ఉంటుంది. స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ (SPD) సహకారంతో అణ్వాయుధ నిల్వలు, క్షిపణి వ్యవస్థలు, క్షిపణి అభివృద్ధి వంటి అంశాలను ఒకే కమాండ్ కిందకు తీసుకురానున్నారు.
ఇదే కాకుండా పాక్ సైన్యం, నేవీ, ఎయిర్ఫోర్స్, రాకెట్ ఫోర్స్, స్ట్రాటజిక్ కమాండ్ మధ్య సమన్వయాన్ని పెంచడం, తూర్పు సరిహద్దు వద్ద వ్యూహాత్మక నిరోధక శక్తిని బలోపేతం చేయడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ఇదే సమయంలో చైనా టెక్నాలజీని పాక్ సైన్యంలో మరింత పెంచాలని భావిస్తోంది. పాక్ సైన్యం ఈ పునర్వ్యవస్థీకరణ చేస్తున్న కారణంగా 15 నెలలుగా సీనియర్ సైనికాధికారుల పదోన్నతులు ఆలస్యమవుతున్నాయి. 2024 నుంచి ఫార్మేషన్ కమాండర్స్ కాన్ఫరెన్స్ను నిర్వహించలేదు. నివేదికల ప్రకారం పాక్ సైన్యంలో అత్యున్నత సైనిక నాయకత్వం వద్దే నిర్ణయాధికారం కేంద్రీకృతమవుతున్నాయి.

