Pakistan: నిన్న శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ ఎంత ఆసక్తికరంగా మారిందో తెలిసిందే. పాకిస్థాన్ సెమీస్ ఆశలపై శ్రీలంక నీళ్లు చల్లింది. మొదటి ఇన్నింగ్స్ చూస్తే పాక్ తప్పకుండా సెమీస్కు క్వాలిఫై అవుతుందని దాదాపు అందరూ భావించారు. కానీ.. శ్రీలంక ప్లేయర్స్ తమతో పాటు పాకిస్థాన్ను సైతం ఇంటికి తీసుకెళ్లారు. ఈ మ్యాచ్ అనంతరం.. కెప్టెన్ సల్మాన్ అఘాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అఘా అసలు టీ20 ఆటగాడే కాదని సొంత దేశస్థులే వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ వికెట్కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడ ముఖ్యంగా భారత్తో పోటీ పడేంత సీన్ లేదని పరోక్షంగా చెప్పేశాడు. భారత్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి టాప్ జట్లతో పోలిస్తే పాకిస్థాన్ స్థాయి చాలా వెనుకబడి ఉందని స్పష్టం చేశాడు. “ఇతర జట్లు టీ20 డిమాండ్స్కు తగ్గట్టు అభివృద్ధి చెందాయి. మనం మాత్రం ఇంకా అక్కడికి చేరలేదు. వారు చంద్రుడిపై ఆడుతుంటే, మనం భూమిపైనే ఉన్నాం,” అని ఎఎఫ్పీ ఇంటర్వూలో తెలిపాడు.
READ MORE: Israel-Iran War: ఇరాన్పై ఇజ్రాయిల్ భీకర దాడులు, టెహ్రాన్పై బాంబుల వర్షం..
టోర్నమెంట్కు ముందు ఆస్ట్రేలియాను 3-0తో ఓడించి పాకిస్థాన్ భారీ అంచనాలు పెంచుకుంది. స్పిన్కు అనుకూలంగా ఉండే శ్రీలంక పిచ్లపై ఐదుగురు స్పిన్నర్లతో బరిలో దిగింది. కానీ నెదర్లాండ్స్పై తొలి మ్యాచ్లోనే జట్టు బలహీనతలు బయటపడ్డాయి. చివరి ఓవర్లో ఫహీమ్ అష్రఫ్ 11 బంతుల్లో 29 పరుగులు చేయకపోతే ఆ మ్యాచ్ సైతం చేజారిపోయేదే. ఏదో అలా బయటపడ్డారంతే! భారత్తో జరిగిన కీలక మ్యాచ్లో అఘా తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. టాస్ గెలిచి భారత్ను ముందుగా బ్యాటింగ్కు పంపిన నిర్ణయం ప్రతికూలంగా మారింది. భారత్ 175 పరుగులు చేయగా, పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ను ఆలస్యంగా బౌలింగ్కు తీసుకురావడం పెద్ద తప్పిదమని మాజీ ఆటగాడు బసిత్ అలీ విమర్శించాడు. “ఆ పరిస్థితుల్లో ముందుగా బ్యాటింగ్ చేయించడం ఏంటి?” అని ప్రశ్నించాడు.
READ MORE: Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇంగ్లాండ్ మ్యాచ్లోనూ తారిక్ మంచి ఆరంభం చేసినప్పటికీ, రెండో ఓవర్ ఆలస్యంగా ఇవ్వడం ద్వారా హ్యారీ బ్రూక్కు ఇన్నింగ్స్ను నిలబెట్టుకునే అవకాశం కల్పించారని విమర్శలు వచ్చాయి. బాబర్ ఆజమ్పై కూడా విమర్శలు తారాస్థాయికి చేరాయి. నంబర్ నాలుగులో నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం జట్టును ఒక్కసారిగా ముంచేసింది. చివరి మ్యాచ్లో అతన్ని డ్రాప్ చేసిన తర్వాతే పాకిస్థాన్ 200కి పైగా స్కోరు చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఫలితాల తర్వాత పాకిస్థాన్ అభిమాని నిన్న స్టేడియంలో మాట్లాడుతూ.. “మేమంతా బాబర్ అభిమానులమే. కానీ టీ20 డిమాండ్స్కు తగ్గట్టు మారలేకపోయాడు. అభిమానులమంతా నిరాశతో పాటు కోపంగా ఉన్నాం. అయినా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఓటములకే సాక్షులమవుతామేమో,” అని వాపోయాడు. ఏది ఏమైనా పాకిస్థాన్కు కప్పు గెలిచేంత సీన్ లేదని సొంత దేశస్థులు చెబుతుండటం ఇక్కడ విశేషం.
