Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో

Pakistan Air Force

Pakistan Air Force

Operation Sindoor: పాకిస్థాన్ సైనిక దళాలకు సోషల్ మీడియాలో కలరింగ్ ఇవ్వడం, లేని విజయాన్ని ఉన్నట్లు చూపించుకోవడం కొత్తేమీ కాదు. కానీ, ఈసారి వారు ఏకంగా ఊహాశక్తికి పదును పెట్టి, కృత్రిమ మేధ (AI) సాయంతో ఓ బాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాను మించిన గ్రాఫిక్స్ వీడియోను వదిలారు. 2025 మే నెలలో జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో తాము భారతదేశంపై ఏ రేంజ్‌లో విరుచుకుపడ్డామో చూపిస్తూ పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ‘ఫిజాఓన్ కే పాస్బాన్’ పేరిట ఈ యానిమేషన్ వీడియోను విడుదల చేసింది. అయితే ఇందులో చిన్న లోపం ఏంటంటే.. అసలు నిజమైన సాక్ష్యాలు గానీ, ఒక్క ఫోటో గానీ అందులో లేవు.

ఈ వీడియోలో పాకిస్థాన్‌ వైమానిక దళం ప్రదర్శించిన విన్యాసాలు చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కానంత విచిత్రంగా ఉన్నాయి. భారతదేశపు అధునాతన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను రెంటింటిని ధ్వంసం చేశామని, భారత్‌కు చెందిన 32 ఎయిర్ బేస్‌లను తునకలు చేశామని, చివరికి భారత పార్లమెంట్, గుజరాత్‌లోని కాండ్లా పోర్ట్, ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లపై కూడా దాడులు చేశామని ఆ వీడియోలో చూపించారు. అంతేకాకుండా ఉపగ్రహాలను జామ్ చేయడం, గ్రిడ్లను నిలిపివేసి విద్యుత్‌ను నిలిపేయడం, ఇంధన సరఫరాలను అడ్డుకోవడం వంటి మాయాజాలాలను తాము చేసేశామని భ్రమపడ్డారు. నాలుగు రఫేల్, ఒక సుఖోయ్, మిగ్-29, మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో పాటు ఒక హెరాన్ డ్రోన్‌ను కూల్చేశామని గ్రాఫిక్స్‌ వీడియోలో చూపించారు. అయితే 32 ఎయిర్ బేస్‌లపై జరిగిన దాడులకు సంబంధించిన రన్‌వేలు, హ్యాంగర్‌లు ధ్వంసమైనట్లు ఒక్కటంటే ఒక్క ఉపగ్రహ చిత్రాన్ని లేదా వీడియో ఆధారాన్ని పాకిస్థాన్‌ ప్రదర్శించలేకపోయింది. అసిమ్ మునీర్ నేతృత్వంలోని పాక్ సైన్యం చేతిలో ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టే, ఇలా ఏఐ గ్రాఫిక్స్‌తో కాలం వెళ్లదీస్తోందని స్పష్టమవుతోంది. ఇది పాకిస్థాన్ సిగ్గుమాలిన చర్యగా సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు భారతదేశం విడుదల చేసిన ఆధారాలను చూస్తే అసలు వాస్తవం ఏంటో ప్రపంచానికి తేటతెల్లమవుతుంది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన వెంటనే భారత్ పాకిస్థాన్‌‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడులు, 11 పాకిస్థాన్‌ సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన ప్రత్యక్ష దృశ్యాలను ఆధారాలతో సహా ప్రపంచం ముందు ఉంచింది. అంతర్జాతీయ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT), శాటిలైట్ ఆధారాలు కూడా భోలారీ, సర్గోధా, నూర్ ఖాన్ వంటి పాక్ ఎయిర్ బేస్‌లు ఎంత దారుణంగా దెబ్బతిన్నాయో ప్రపంచానికి చూపించాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత పాకిస్థాన్‌ సైనిక మౌలిక సదుపాయాలపై భారత్ జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని అమెరికాకు చెందిన ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం ప్రచురించింది. భారత్ రియల్ దాడి ఆధారాలను చూపిస్తే, పాకిస్థాన్‌ రియల్ ఎఫెక్ట్స్ (AI) చూపిస్తుండడం ఇక్కడ గమనార్హం.

ఇక పాకిస్థాన్‌ పేల్చిన పెద్ద తుపాకీ డాంబికం.. S-400 వ్యవస్థలను నాశనం చేశామని చెప్పడం. ఈ క్లెయిమ్‌ను భారత్ ఎప్పుడో తిప్పికొట్టింది. ఆపరేషన్ ముగిసిన కొద్ది రోజులకే ప్రధాని నరేంద్ర మోడీ ఆడంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించి, అక్కడ చెక్కుచెదరకుండా ఉన్న S-400 సిస్టమ్ ముందు నిలబడి ప్రసంగించడమే పాకిస్థాన్‌‌కు పడిన అతిపెద్ద చెంపపెట్టు. ఇటీవలే డిస్కవరీ ఛానెల్ ‘డిక్లాసిఫైడ్: ఆపరేషన్ సింధూర్’ పేరిట విడుదల చేసిన రెండు భాగాల డాక్యుమెంటరీలో ఈ ఆపరేషన్‌కు సంబంధించిన అసలైన దృశ్యాలను, పాక్ ఎంతగా దెబ్బతిన్నదో వివరంగా చూపించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే పాకిస్థాన్‌ ఈ ఏఐ వీడియోను తీసుకురావడం వారికే ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్‌ విడుదల చేసిన ఈ ‘కల్పిత’ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అవుతోంది. “వీడియో ఎడిటింగ్ కాంటెస్ట్ ఉంటే పాకిస్థాన్‌‌కే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది” అని కొందరు ఎద్దేవా చేస్తుంటే, “పాకిస్థాన్‌‌కు డిఫెన్స్ బడ్జెట్ అక్కర్లేదు, ఒక ఏఐ వీడియో జనరేటర్ ఉంటే చాలు, యూట్యూబ్‌లోనే యుద్ధాలు గెలిచేస్తారు” అని నెటిజన్లు ఆడుకుంటున్నారు.