OTR: స్థానిక సమరం.. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతల్లో గుబులు..

Untitled 1 Copy

Untitled 1 Copy

స్థానిక సమరానికి వైసీపీ అధినేత జగన్ శంఖారావం పూరించడమే కాదు.. నేతల రాజకీయ భవిష్యత్తును తేల్చే అల్టిమేటమ్‌ కూడా ఇచ్చారు. ఎక్కడ ఏకగ్రీవాలు జరిగితే.. అక్కడ సమన్వయకర్తలకు నో టికెట్ సంకేతాలు ఆ జిల్లా వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సమస్య ఉంటే చెప్పండి మేమే రంగంలోకి దిగుతామన్న సంకేతాలు కూడా ఇచ్చారు జగన్. మరి అధికార కూటమి ధన, అధికార బలాల ముందు వైసీపీ స్థానిక నాయకత్వం నిలబడగలదా? దానికి క్షేత్ర స్థాయిలో కేడర్ రెడీగా ఉందా..?

పోరు తప్పదు… బరిలో నిలవాల్సిందే… స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ కేడర్‌కు అధిష్ఠానం ఇచ్చిన అల్టిమేటమ్ ఇది. అధికార పార్టీ ఏకగ్రీవాల వ్యూహానికి అడ్డుకట్ట వేయకపోతే, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల పొలిటికల్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడుతుందని అధినేత జగన్ పరోక్షంగా హెచ్చరించారు. ఇప్పుడు ఇదే ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతల్లో గుబలు రేపుతోంది. ఎందుకంటే అధినేత ఏమో అంత సీరియస్ గా చెప్పారు.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి చూస్తే అంత అనుకూలంగా లేవు. ఇలాంటి సమయంలో తాము లోకల్ బాడీ ఎన్నికలను ఎలా డీల్ చేయాలని దాదాపు అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తల్లో ఈ ఆందోళన కనిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14స్థానాలు ఉంటే.. ఒక చోట బీజేపీ, మిగిలిన 13చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలే గెలిచారు. అంటే అన్ని చోట్ల వాళ్లే అధికారంలో ఉన్నారు. పైగా గత రెండేళ్లుగా స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులపై కేసులు ఇతర ఒత్తిళ్లు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం.. దానిని అధినేత జగన్ సీరియస్ గా తీసుకోవడం.. అది ఏకంగా తమ సీటుకు ఎసరు పెట్టేలా మారడంతో గత కొన్ని రోజులుగా వైసీపీ సమన్వయకర్తల్లో ఆందోళన కనిపిస్తోంది.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే అనంతపురం జిల్లా0 వైసీపీ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో బెంగళూరులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని 14మంది సమన్వయకర్తలు వెళ్లారు. అక్కడ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్నది ఆరా తీశారు. నియోజకవర్గాల వారిగా రఫ్ గా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఎక్కడెక్కడ కష్టంగా ఉందన్నది తెలుసుకున్నారు. అయితే అధినేత తరహాలోనే బెంగళూరు వేదికగా జరిగిన రీజినల్ కోఆర్డినేటర్ల సమావేశం సైతం ఇదే హెచ్చరికను పంపింది. అయితే ఇందులో ఒక భరోసాను కూడా లీడర్లకు ఇచ్చింది. మీరు ఎక్కడా రాజీ పడవద్దని.. అన్ని చోట్ల పోటీ పెట్టాల్సిందేనన్నారు. అందుకు తగిన విధంగా లోకల్ లీడర్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎవరైనా అభ్యర్థులు ముందుకు రాని చోట ఇప్పటి నుంచే ఒక ప్లానింగ్ తో ముందుకెళ్తాలని మిథున్ రెడ్డి సలహా ఇచ్చారు. గెలుపు విషయాన్ని పక్కన పెడితే తమ బలం ఏంటో చెప్పాలన్న దానిపై ఆయన స్పష్టంగా ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. గట్టిగా నిలబడిన వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామన్నట్టుగా చెప్పారని సమాచారం. నియోజకవర్గాలుగా సమావేశాలు ఏర్పాటు చేసి బలమైన అభ్యర్థుల ఎంపిక ఇప్పటినుంచి చేయాలని చెప్పారని సమన్వయకర్తలు అంటున్నారు.

అయితే పైస్థాయిలో నాయకత్వం ఎంతగా వెన్నుతడుతున్నా… క్షేత్రస్థాయిలో ఉన్న గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది. కూటమి ప్రభుత్వం సృష్టిస్తున్న పొలిటికల్ ప్రెజర్, అంగబలం, అర్థబలం ముందు తలవంచకుండా వైసీపీ స్థానిక నేతలు బరిలోకి దిగాలంటే అది చాలా సాహసంతో కూడుకున్న పని. అందుకే డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పైగా కొన్ని నియోజకవర్గంలో సమన్వయకర్తను వ్యతిరేకిస్తున్న నాయకులు ఉన్నారు. అలాంటి వారికి కొన్ని మండలాలు, లేదా పంచాయతీల్లో పట్టు ఉంది. ఇలాంటి చోట సమన్వయకర్త పెట్టిన వ్యక్తికి ఇబ్బందులు తప్పేలా లేవు. అసలు సమన్వయకర్తనే మార్చాలని గతంలో అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. కొన్ని చోట్ల పార్టీ నేతల సస్పెన్షన్లు కూడా జరిగాయి. ఓవైపు అధికార పార్టీ అంగబలంతో పాటు డబ్బు బలంతో లోకల్ పోరులో రంగంలోకి దిగుతుంది. దీన్ని ఎదుర్కోవడం ఒక సవాల్ అయితే.. ఇక ఇంటి పోరు కూడా సమన్వయకర్తలకు పెద్ద కష్టంగా మారే అవకాశం ఉంది. తాడిపత్రి వంటి చోట అయితే గట్టి సవాల్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళన మాత్రం ఉంది..

వైసీపీ సమన్వయకర్తల ముందు ఇప్పుడు మూడు సవాళ్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి.. ఒకటి డబ్బు, రెండవది కూటమి తట్టుకుని నిలబడే గ్రౌండ్ లెవల్ లీడర్లు, మూడు సొంత పార్టీలో ఉన్న విబేధాలు వీటన్నింటినీ అధిగమిస్తే కచ్చితంగా 90శాతంకి పైగా స్థానాల్లో పోటీ గట్టిగానే ఉండే ఛాన్స్ ఉంది.